తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట కు తెలంగాణ రైతులు నో చెప్తున్నారు. కేసీఆర్ చెప్పింది ఒకటి అయితే ప్రజలు చేస్తోంది మరొకటి. ప్రభుత్వం మొక్కజొన్న సాగు చేయొద్దని చెప్పినా రైతులు అదే పంట వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 40 వేల ఎకరాల్లో పంట వేశారు. ఈ పంట ఉత్పత్తికి ఏం జరగనుందనే చర్చ జరుగుతోంది.
కేసీఆర్ ఏం చెప్పారు ?
దేశవ్యాప్తంగా డిమాండ్ పెద్దగా లేకపోవడంతో ఈ ఏడాది రైతులెవరూ మొక్కజొన్న సాగు చేయొద్దని సీఎం కేసీఆర్ సూచించారు. ఎవరైనా సాగు చేసినా ప్రభుత్వం వాటికి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయబోదని ప్రకటించారు. రైతులు మాత్రం తమకున్న అనుభవంతో ఈ యాసంగిలో పొలాల్లోని భూమికి అనువైన మక్కల్నే సాగు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 40 వేల ఎకరాల్లో పంట వేశారు. ఒక్క నిర్మల్ జిల్లాలోనే అత్యధికంగా 17 వేల ఎకరాల్లో మక్క సాగు అవుతోందని అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ లెక్కలు చెప్తున్నాయి. ఆ తర్వాత ఖమ్మంలో దాదాపు 5వేలు, మహబూబ్ నగర్ లో దాదాపు 4వేలు, కామారెడ్డి, జగిత్యాల, వరంగల్ జిల్లాల్లో దాదాపు 2 వేల ఎకరాల్లో సాగు చేయగా మిగతా జిల్లాల్లో కొంతమేర మొక్కజొన్న సాగవుతోంది.
ఎందుకు ఇలా జరుగుతోంది ?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3.50 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, రాగులతో పాటు కొన్ని పప్ప దినుసుల పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో కందులు ఎక్కువ మొత్తంలో ఉండగా ఆ తర్వాతి ప్లేస్ లో మొక్కజొన్న పంటనే ఉంది. మొక్కజొన్న సాగును ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వేరే పంటలకు భూమి అనువుగా లేకపోవడంతో యాసంగిలోనూ వాటిని పండించాల్సి వస్తోందని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే మక్కలను పశువులకు మేతగా, దాణాగా ఉపయోగించవచ్చు. లేదంటే పచ్చి కంకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం రైతులు ఆ దిశగా ఆలోచించి మక్క సాగు చేస్తున్నారు అని చెప్తున్నారు.