ఇండియన్ నేషనల్ కాంగ్రెస్… దేశంలోనే అతి పురాతనమైన రాజకీయ పార్టీ. అయితే, ఈ పార్టీకి ఫుల్ టైం అధ్యక్షుడు కూడా లేని పరిస్థితి. కొందరు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటే.. మరికొందరు సోనియాగాంధీయే పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారు.
ఇలాంటి సందిగ్దావస్థలో కొత్త పల్లవి తెరపైకి రావడంతో ఆసక్తికర చర్చకు దారితీసినట్లయింది. పార్టీ నాయకత్వాన్ని మార్చాలంటూ సుమారు 20 మందితో కూడిన సీనియర్ల బృందం తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
నరేంద్ర మోదీ ఎఫెక్టేనా?
2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడి కోసం పార్టీ నేతలు కసర్తతు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో కొత్త నాయకత్వం అంశం తెరమీదకు వచ్చింది.
వీళ్లే అసలు రచ్చకు కారణం…..
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన సీడబ్ల్యూసీ భేటీ సోమవారం జరగనుంది. సీడబ్ల్యూసీ సమావేశంలో ఆన్లైన్లో జరగనుండగా పార్టీలో నాయకత్వ ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే సమయంలో మాజీ ఎంపీలు, మాజీ మంత్రులైన కాంగ్రెస్ ముఖ్య నేతలు లేఖ రాశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, శశిథరూర్, మిలిందర్ దేవరా, జితిన్ ప్రసాద, పృథ్విరాజ్ చవాన్, భూపేందర్ సింగ్ హుడా వంటి నేతలతోపాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ లేఖలు రాసిన వారిలో ఉన్నారు.
మనం నమ్మకం కోల్పోతున్నాం
పార్టీ ప్రస్తుత నాయకత్వాన్ని మార్చడంతోపాటు పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో సీనియర్లు డిమాండ్ చేశారు. పార్టీలో అనిశ్చితి ఏర్పడిందని, యువత విశ్వాసం కోల్పోతున్నదని పేర్కొన్నారు. అందువల్ల పార్టీకి పునరుజ్జీవం పోయడానికి, మార్గదర్శనం చేయడానికి సంస్థాగత యంత్రాంగాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాలని అధ్యక్షురాలికి సూచించారు. పార్టీకి పూర్తి కాలపు అధ్యక్షునితో పాటు దూర దృష్టి, క్రియాశీలకంగా ఉండే అధ్యక్షుడు ఉండాలని పేర్కొన్నారు. అయితే పార్టీ నాయకత్వం మార్పు గురించి 23 మంది పార్టీ నేతలు బహిరంగంగా సోనియాకు లేఖ రాయడాన్ని చాలా మంది నేతలు తప్పుపట్టారు. ఇలాంటి విషయాలు అంతర్గతంగా చర్చించడం మంచిదని హితవు పలికారు.
సోనియా హర్టయ్యారా?
కాగా, పార్టీలోని ఎక్కువ మంది నాయకత్వ మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో తాత్కాలిక అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకోవాలని సోనియా గాంధీ భావించినట్లు సమాచారం. దీంతో కొత్త అధ్యక్షుడ్ని నిర్ణయించాలని పార్టీ సీనియర్లను ఆమె కోరినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో నేడు జరుగనున్న ఆన్లైన్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరన్నది ఒక స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే సోనియాకు లేఖ రాసిన వారితో మాట్లాడారని, అధ్యక్ష పదవి నుంచి సోనియా తప్పుకుంటున్న విషయాన్ని వారికి చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే కొత్త అధ్యక్షుడి ఎన్నిక గురించి వారి అభిప్రాయాన్ని ఆయన తెలుసుకున్నట్లు వెల్లడించాయి.