కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు ,రాజకీయ నేతలు త్వరలోనే కోర్టు మెట్లు ఎక్కే సమయం ఆసన్నమవుతోంది.ఈ విషయంలో సీరియస్గా ఉన్న సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులను నిర్దిష్ట కాలవ్యవధిలో విచారించాలని ఆదేశించటం తెలిసిందే.
అంతేగాక ఏయే రాష్ట్రాల్లో ఎన్నిన్ని ఈ తరహా కేసులు పెండింగ్లో ఉన్నాయో తెలుసు కోవడానికి రాష్ర్టాల హైకోర్టులు నుండి సుప్రీంకోర్టు నివేదికలు కోరింది. అమికస్ క్యూరీగా విజయ్ హన్సారియా ను సుప్రీంకోర్టు నియమించింది.బుధవారం ఈ అంశాన్ని సుప్రీం కోర్టు విచారించింది.అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా వివిధ రాష్ర్టాల హైకోర్టులు పంపిన నివేదికలను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి సమర్పించారు. ప్రజాప్రతినిధులకు సంబంధించి అధిక శిక్ష పడే కేసులు, ప్రస్తుతం పదవిలో ఉన్న వారి కేసుల విచారణకు ప్రాధాన్యం ఇవ్వాలని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా ఈ సందర్బంగా సుప్రీంకోర్టును కోరారు. నేతల మీద ఉన్న పెండింగ్ కేసుల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చాలా రాష్ట్రాలు ఇప్పటికీ నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను నియమించలేదని ధర్మాసనానికి అయన వివరించారు.
కనీసం రెండేళ్లకు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను నియమించేలా రాష్ట్రాలను ఆదేశించాలని ధర్మసనాన్ని కోరారు హన్సారియా. ఈ సందర్భంగా ధర్మాసనానికి ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు.
కేసులను ప్రాధాన్య క్రమంలో విచారించాలని..కొత్త కేసులు, అధిక శిక్ష పడే కేసులు, ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి కేసుల విచారణకు ప్రాధాన్యమివ్వాలని సాక్షులకు భద్రత కల్పించడంపై ట్రయల్ కోర్టు నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని హన్సారియా కోర్టును కోరారు.కాగా కర్ణాటక, బెంగాల్, తమిళనాడులో ప్రత్యేక కోర్టులు సరిపడా లేవని, వాటిని ఏర్పాటు చేసేలా హైకోర్టులను ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానానికి నివేదించారు అమికస్ క్యూరీ.
ఈ మేరకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై నివేదిక అందించాలని ఈ రాష్ట్రాలను సుప్రీం ఆదేశించింది.కాగా ఈ కేసులో కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతుందన్నారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థల్లో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను ఎందుకు సమర్పించలేదని కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించగా.. వేరే కేసు విచారణలో ఉన్నందున సమయానికి వివరాలు ఇవ్వలేకపోయామని మెహతా వివరించారు.తదుపరి విచారణ తేదీకి వివరాలు సమర్పిస్తామని స్పష్టం చేశారు.మొత్తం మీద అతి త్వరలోనే ఈ కేసుల విచారణ ప్రారంభం కాగల సూచనలు గోచరిస్తున్నాయి.