Siddaramaiah: దేశంలో ఓట్లు సీట్లతో సంబంధం లేకుండా బీజేపీ పలు రాష్ట్రాల్ల్ అధికారాన్ని కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో బీజేపికి బలం లేకపోయినా ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను గుప్పిట పెట్టుకుని అధికారాన్ని చెలాయిస్తోంది. అదే విధంగా మోడీ సర్కార్ లో మైనార్టీ ముస్లింలకు, క్రైస్తవులకు ప్రాధాన్యత ఇవ్వడం లేని విషయం తెలిసిందే. మోడీ, అమిత్ షా ద్వయం ఏమి చేయాలనుకుంటే అది చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ పరిణామాలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్దారామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం ఆర్ గుండూరావు జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఎటువంటి ప్రజాబలం, ప్రజామోదం లేకుండానే దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు.
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అని చెప్పే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో క్రైస్తవులు, ముస్లింలకు చోటు కల్పించలేదని అన్నారు. కర్ణాటకలో అధికారంలోకి బీజేపీ ఉన్నప్పటికీ పాలన మాత్రం సంఘ్ పరివారే చూసుకుంటోందని విమర్శించారు. అబ్దద్దాలు సృష్టించడం, వాటిని మార్కెటింగ్ చేయడం బీజేపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. బీజేపీ నేతలు తాలిబన్లతో సమానమని విమర్శించారు. హిట్లర్ పాలనలో పాల్ జోసెఫ్ గ్లోబెల్స్ అనుసరించిన సిద్ధాంతాలనే బీజేపీ కూడా పాటిస్తుందనీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో హిట్లర్ జన్యువులు ఉన్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సిద్ధారమయ్య ప్రజలను హెచ్చరించారు.