ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న అతి పెద్ద సమస్య కరోనావైరస్. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పటికే కరోనావైరస్ బారినపడి అనేక మంది మృత్యువాత పడ్డారు. వైరస్ వ్యాప్తి మొదలయ్యి ఏడాది గడిచిపోయినప్పటికీ ,ఈ వ్యాధికి సరైన చికిత్స, టీకా అందుబాటులోకి రాలేదు.అసలు ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందో అన్న విషయంపై కూడా పూర్తీ అవగహన లేకపోవడంతో శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గర్భిణీలలో వైరస్ వ్యాప్తి బిడ్డకు సంక్రమిస్తుంది లేదా అనే విషయం మీద కూడా ఇప్పటికి సరియైన అవగహన లేదు. ఈ తరుణంలో తాజాగా వైరస్ వ్యాప్తి తో బాధపడిన మహిళకు పుట్టిన బిడ్డలో కోవిద్-19 నిరోధక యాంటీబాడీలు ఉన్నట్లు నిపుణులు కనుగోన్నారు. ఇది ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది అని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు.
సింగపూర్ కు చెందిన ఎంగ్ చాన్ అనే మహిళా మార్చ్ నెలలో కోవిద్-19 బారిన పడింది. స్వల్ప లక్షణాలు ఉన్న ఈమె, రెండున్నర వారాల చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది.ఈమె ఇటీవల సింగపూర్ లోని నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ లో మగ బిడ్డకు జన్మనించింది. అయితే నవజాత శిశువు కు చేసిన కోవిద్ పరీక్షలలో వైరస్ సంక్రమించలేదని తేలింది. కానీ పుట్టిన బిడ్డలో యాంటీబాడీలు ఉన్నట్లు వెల్లడయింది. ఒకవేళ గర్భిణీలకు కరోనా సోకితే వారి నుండి పుట్టిన బిడ్డలకు వస్తుందా..? లేదా అనే విషయమై ఇంకా ఏ విషయమూ నిర్ధారించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. కరోనా సోకిన మహిళలకు పుట్టిన సంతానంలో యాంటీ బాడీస్ విషయమై చైనాకు చెందిన వైద్య బృందం ఓ నివేదిక ( “ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్”) రూపొందించింది. శ్వాస కోశ వైరస్లు పిండం మీద ప్రభావం చూపవని, పుట్టుకకు సంబంధించిన సమస్యలను కలిగించవని పేర్కొన్నారు. తల్లికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ పుట్టబోయే శిశువుపై ప్రభావితం చేయదని వివరించారు. ఇప్పటి వరకు, గర్భంలో ఉన్న శిశువు చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ నమూనాల్లో గానీ, తల్లిపాలలో గానీ ఎలాంటి యాక్టివ్ వైరస్ కనుగొనబడలేదు అని వైద్యులు అంటున్నారు. కాగా ఎంగ్ చాన్ పుట్టిన బిడ్డకు కోవిద్ యాంటీబాడీలు తల్లి నుంచే లభించి ఉంటాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు.