పాకిస్థాన్లో ఒంటరిగా జీవిస్తున్న ఏనుగుకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. ఏనుగు ఏంటి….విముక్తి ఏంటి అనుకుంటున్నారా…అయితే మీరు ఇది చదవాల్సిందే. శ్రీలంక నుండి పాకిస్థాన్ కు తెచ్చిన ఏనుగు దశాబ్దాలుగా ప్రజలను అలరిస్తోంది. అయితే 2012 లో తన సహచర ఏనుగు మరణించడం తో ఈ ఏనుగు ఒంటరిగా మిగిలిపోయింది. ప్రపంచంలో ఒంటరిగా నివసిస్తున్న ఏకైక ఏనుగుగా చరిత్ర సృష్టించడంతో, అంతర్జాతీయంగా దీని పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు దీన్ని కాంబోడియాకు తరలించాలంటూ హైకోర్టు తుది తీర్పుతో ఏనుగు ఒంటరితనానికి ఫుల్ స్టాప్ పడింది.
కావన్ అనే గున్న ఏనుగును పాకిస్థాన్ కు శ్రీలంక బహుమతి గా ఇచ్చింది. 35 ఏళ్ల నుండి ఇది పాకిస్థాన్ ఇస్లామాబాద్ లోని ఓ చిన్న జూ లో ప్రజల సందర్శనార్ధం ఉంది. అయితే 2012 లో తన సహచర ఏనుగు అయినా సహేలీ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించింది. సహచర ఏనుగు మరణించగా ప్రపంచంలో ఒంటరిగా నివసిస్తున్న ఏకైక ఏనుగుగా చరిత్ర సృష్టించడంతో, అంతర్జాతీయంగా కావన్ పేరు మారుమోగిపోయింది. సహేలీ మరణంతో కావన్ కు గుండె పగిలినంత పనైందని, అప్పటి నుంచి దీని ఆరోగ్యం బాగా దెబ్బతినింది. ఒంటరిగా ఉండలేక ఎమోషనల్ గా వీక్ అయిన ఈ ఏనుగు, సరిగా తిండి తినక, శారీరకంగానూ పటుత్వం కోల్పోయింది. దీంతో పశువైద్యులు ఈ ఏనుగు బలహీనపడిందని, చెప్పటంతో అంతర్జాతీయ సమాజం ఈ ఏనుగు కోసం పోరాటం మొదలుపెట్టింది. జంతు హక్కుల ఉద్యమకారులు ఈ ఏనుగును కాపాడాలంటూ ఉద్యమించారు. దీంతో ఈ ఏనుగుకు ఓ జంట దొరికేందుకు అనువుగా ఉండేలా కాంబోడియా అడవులకు పంపించేస్తున్నట్టు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసినట్టు జియో న్యూస్ వెల్లడించింది. జూ నుంచి ఈ ఏనుగును ఇస్లామాబాద్ విమానాశ్రయానికి తరలించి అక్కడి నుంచి ఏనుగు కోసం ప్రత్యేకంగా తెప్పించిన రష్యన్ స్పెషల్ జెట్ లో కాంబోడియాకు తరలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కావన్ మొత్తం 10 గంటల పాటు విమానంలో ప్రయాణం చేయనుంది.
అమెరికన్ సింగర్ షేర్ ఈ ఏనుగును కాపాడాలంటూ, వేరే దేశానికి తరలించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కాగా, శుక్రవారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో చేర్ భేటీ అయ్యారు. అనంతరం కావన్ను కాంబోడియాకు తరలించే నిర్ణయం తీసుకున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. మరోపక్క కావన్ను కాంబోడియాకు తరలించేందుకు ముందుకొచ్చినందుకు చేర్కు ఇమ్రాన్ ఖాన్ అభినందనలు తెలిపారు. అయితే ఇస్లామాబాద్ హైకోర్టు మేలోనే స్థానిక జూను మూసివేయాలని, ఈ జంతుప్రదర్శన శాలలో జంతువుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని పేర్కొంది. జూలైలో కావన్ ను కాంబోడియా తరలించేందుకు కోర్టు అంగీకరించింది. కాగా.. కావన్ను పాకిస్థాన్ నుంచి కాంబోడియాలోని సియెమ్ రీప్ ప్రావిన్స్కు తరలించనున్నారు.