ఏమాటకామాట చెప్పుకోవాలంటే… తాను ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ మొదటి ఏడాదంతా సంక్షేమంపైనే జగన్ పూర్తి దృష్టి కేంద్రీకరించారు! ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచీ… ప్రజలకు ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేదానిపైనే జగన్ దృష్టి సారించారు. ఈ క్రమంలో నవరత్నాల పేరుతో అనుకున్న సంక్షేమ కార్యక్రమాలు చేసుకోగలిగారు! ఈ కార్యక్రమాల్లో చిన్న చిన్న రాజకీయ విమర్శలు వచ్చినప్పటికీ.. సంక్షేమం విషయంలో జగన్ సర్కార్ కు ఫుల్ మార్కులు పడినట్లే. ఆ సంగతి అలా ఉంచితే… సంక్షేమం ఒక్కటే కాదు కదా… ఆదాయం పెంచుకునే మార్గాలు మరింత ముఖ్యం కదా అనే కామెంట్లు బలంగా వినిపించాయి. వీటికి సమాధానాలు జగన్ ఎప్పుడో సిద్ధం చేసుకున్నారట!
జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాదిలో సంక్షేమ పథకాల పేరుతో డబ్బు పంపకాలు తప్ప రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే ఏ ఒక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. “ఏపీలో రూ.18 వేల కోట్ల పెట్టుబడులతో తొమ్మిది భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.. శుక్రవారం నిర్వహించే రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో ప్రభుత్వం వాటికి ఆమోదం తెలపనుంది.. వాటికిచ్చే ప్రోత్సాహకాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా నిర్వహించిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల కమిటీ (ఎస్ఐపీసీ)లో అధికారులు చర్చించారు.. వీటితో పాటు శ్రీసిటీలో జపాన్ కు చెందిన పది పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.. వాటి ద్వారా మరో రూ.6 వేల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి..” అనేది ఆ వార్త సారాంశం! దీంతో ఆదాయం పెంచుకునే విషయంలో జగన్ తన ప్లాన్స్ తనకు ఉన్నాయని చెప్పకనే చెప్పినట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదే క్రమంలో జగన్ పై మరో విమర్శ… ఉద్యోగాలు లేవని! ఇప్పటికే గ్రామసచివాలయాలు, గ్రామ వాలంటీర్ల పేరుతో లక్షల ఉద్యోగాలు కల్పించమని ఏపీ సర్కార్ చెప్పుకుంటుంది. ఇదే క్రమంలో కొత్తగా రాబోయే.. అలయన్స్ టైర్ గ్రూప్ (ఏటీజీ)నకు చెందిన ఏటీసీ టైర్స్ ప్రైవేట్ లిమిటెడ్, షాన్ షూ కేసింగ్ , ట్రీన్ టెక్, గ్రీన్ ఫ్లై, చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ (సీఆర్ఆర్సీ), శ్రీకాళహస్తి పైప్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వంటి భారీ పరిశ్రమలతో స్థానికంగా ఉద్యోగాలు అధికంగా వచ్చే అవకాశాలున్నాయి.
ఇప్పటికే “స్థానికులకే ఉద్యోగాలు” అనే విషయంలో జగన్ సర్కార్ సీరియస్ గా ఉన్న నేపథ్యంలో… ఈ పరిశ్రమల ఏర్పాటుతో అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో అధిక సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా మార్గం సుగమం అయినట్లే!! దీంతో… సంక్షేమం విషయంలోనే కాదు… అభివృద్ధి, ఉద్యోగాల విషయంలో కూడా జగన్ సీరియస్ గా ప్లాన్స్ చేసుకుంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు!