Sirisha Bandla: చిన్నప్పుడు చందమామ కథలు వింటూ చందమామని చూస్తూ ఆ నక్షత్రాలు ఎన్నో లెక్క పెట్టిన సందర్భాలేన్నో.. ఆకాశంలో చంద్రుడిని, నక్షత్రాలని ఎంత సేపు చూసినా తనివి తీరదు.. వాటిని మరింత దగ్గరగా చూడాలనే ఆశ అందరికీ ఉంటుంది.. తను కూడా చంద్రుని, నక్షత్రాలని అందుకోవాలనుకుంది.. అందుకోసం ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంది.. కానీ దృష్టి సమస్యతో తన లక్ష్యాన్ని వదులుకోవాల్సి వస్తుందేమో అనుకుంది.. కానీ ఒక మార్గంలో అవకాశం చేజారిన.. మరోదారి ప్రయత్నించింది.. పట్టు వదలకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. తాజాగా అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తొలి తెలుగు తేజం “శిరీష బండ్ల”..!!
శిరీష బండ్ల స్వస్థలం ప్రకాశం జిల్లా, చీరాల. తండ్రి బండ్ల మురళీధర్, తల్లి అనురాధ ఇద్దరు, అమెరికా ప్రభుత్వ విభాగంలో పని చేస్తున్నారు. అక్క ప్రత్యూష వర్జీనియా యూనివర్సిటీలో సైంటిస్ట్. శిరీష కు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడే కుటుంబం అమెరికా లో స్థిరపడ్డారు. శిరీష స్పేస్ ఇంజనీరింగ్ చదువుతున్న రెండవ సంవత్సరం నుండి ఓ ఇంజనీరింగ్ సంస్థలో ఇంటర్న్ గా పనిచేస్తూ మెళుకువలను నేర్చుకుంది. ఇంజనీరింగ్ సమయంలోనే జీరో గ్రావిటీ లో ప్రయాణించే అవకాశం సొంతం చేసుకుంది. పర్డ్యూ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందగానే ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ లో స్పేస్ ఇండస్ట్రీలో ఎంబీఏ పూర్తి చేసింది.
2012లో కమర్షియల్ స్పేస్ ఫెడరేషన్ తన కలల రంగంలోకి అడుగు పెట్టింది. 2015లో వర్జిన్ గాలికిక్ట్ సంస్థలో బిజినెస్ డెవలప్మెంట్ అండ్ గవర్నమెంట్ అఫైర్స్ మేనేజర్ గా చేరి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకుంది. ఆ సంస్థ లాంచర్ 1, స్పేస్ షిప్ 2 ప్రోగ్రాములు విజయవంతం సాధించడం లోనూ శిరీష ప్రధాన పాత్ర పోషించింది. తాజాగా వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ క్రాఫ్ట్ సంస్థ ఈనెల 11న ఒక టెస్ట్ స్పేస్ ఫ్లైట్ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇందులో ఆరుగురు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇందులో ఒక బిలియనీర్, ఇద్దరు పైలెట్లు, ముగ్గురు స్పేస్ స్పెషలిస్టులు ఉన్నారు. రిచర్డ్ బ్రాస్నన్, శిరీష బండ్ల, దేవ్ మెక్ కె, మైఖేల్ మసూక్కి, సీజే స్టర్ కోవ్, కెల్లి ల్యాటిమర్ పసిఫిక్ టైం జోన్ ప్రకారం ఈ నెల 11వ తేదీ తెల్లవారుజామున ఈ స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి ఎగరనుంది. దీంతో అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న తొలి తెలుగు మహిళ శిరీష బండ్ల, తొలి ధనిక వ్యక్తిగా రిచర్డ్ బ్రాస్నన్ చరిత్ర సృష్టించనున్నారు.