TRS MLAs poaching case: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కేరళ రాష్ట్రానికి చెందిన కీలక నేతకు సీట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కేరళ రాష్ట్రానికి చెందిన తుషార్ వెళ్లప్పల్లికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 21వ తేదీలోపు విచారణకు హజరు కావాలని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. తుషార్ గత పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలోని వాయినాడ్ లో రాహుల్ గాంధీ పై ఎన్డీఏ అభ్యర్ధి గా పోటీ చేసి ఓడి పోయారు. బీజేపీ అగ్రనేతలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయనే వాదన ఉంది. ఎమ్మెల్యే ల కొనుగోలు బేరసారాలు నిర్వహించిన కేసులో నిందితుడుగా ఉన్న రామచంద్రభారతితో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో తుషార్ ఫోన్ లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే కేరళకు చెందిన మరో స్వామిజీ జుగ్గూజి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను విచారించిన అధికారులు ఎపి, హర్యానా, కేరళ, కర్ణాటక తో పాటు హైదరాబాద్ లోని పలు ప్రదేశాల్లో సోదాలు జరిపారు. హైదరాబాద్ లోని నందకుమార్ కు చెందిన హోటల్, నివాసాలలో సోదాలు జరగ్గా, తిరుపతిలోని సింహయాజీ ఆశ్రమంలో , అలాగే హర్యానా, కర్ణాటక లో రామచంద్ర భారతి నివాసాల్లో, అలాగే కేరళ రాష్ట్రంలోని ఓ వైద్యుడి నివాసంలో సోదాలు జరిపినట్లు తెలుస్తొంది. ఈ కేసులో కేరళలోని వైద్యుడు కూడా మద్యవర్తిత్వం చేశాడని సమాచారం. అందులో భాగంగానే సిట్ సోదాలు జరిపింది. బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై ఇటీవల హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తును హైకోర్టు పర్యవేక్షిస్తుందని చెప్పింది.