Siva nadar:ఈదేశంలో పేదరికానికి కొదువలేదు. అలాగే ధనవంతులకు కూడా కొదువలేదు. చచ్చాక తీసికెళ్ళేది ఏది లేదని తెలిసినా కూడా ఇంకా కూడబెడుతూ వుంటారు. అవును, ఇక్కడ దానం చేసేవాళ్లను చేతివేళ్లమీద లెక్కపెట్టవచ్చు. రూపాయి సంపాదించినాడు ఇంకా ఇంకా కూడబెట్టాలని చూస్తాడే తప్ప, ఆపదలో ఉన్నవాడిని కన్నెత్తి కూడా చూడడు. ఇలాంటి కలియుగంలో కూడా మనం కొంతమంది దానకర్ణులని చూడవచ్చు. ఇక్కడ చెప్పుకోబోయే వ్యక్తి రోజుకి ఏకంగా రూ.3 కోట్ల రూపాయిలు దానం చేస్తున్నాడు.
అవును, మీరు విన్నది నిజమే. ఆయన మరెవ్వరో కాదు. మన దేశానికి చెందిన.. మన పొరుగున ఉన్న తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడం విశేషం. ఆయనే సాఫ్ట్వేర్ దిగ్గజం HCL టెక్ వ్యవస్థాపక ఛైర్మన్ శివ్ నాడార్. తన దాతృత్వంలో దేశంలోనే ఆయన అగ్ర స్థానంలో నిలిచి దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్నారు. 2021-22లో ఆయన దాదాపుగా రూ.1161 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే సగటున రోజుకు దాదాపు రూ.3 కోట్లను వితరణగా అందించారన్నమాట.
ఎడెల్గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ రూపొందించిన 2022 జాబితాలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్జీ రూ.484 కోట్ల విరాళంతో 2వ స్థానంలో నిలిచారు. ఇక ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ రూ.190 కోట్ల విరాళంతో జాబితాలో 7వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది దాదాపు 15 మంది శ్రీమంతులు ఒక్కొక్కరు రూ.100 కోట్లకు పైగా విరాళాలిచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. జీరోదాకు చెందిన నితిన్ కామత్ నిఖిల్ కామత్ వితరణ 300 శాతం పెరిగి రూ.100 కోట్లకు చేరింది. నిఖిల్ కామత్ ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు కావడం గమనార్హం.