అమరావతి, మార్చి 22: ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఐటి, జిఎస్టి దాడులపై సినీ నటుడు శివాజీ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇవో) గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ప్రస్తుత ఎన్నికల తరుణంలో జరుగుతున్న దాడులపై ఫిర్యాదు అందజేశారు.
అధికారుల దాడులతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. బ్యాంకుల నుండి నగదు తీసుకువెళుతున్నా, తగిన ఆధారాలు చూపించినా నగదు సీజ్ చేస్తుండటాన్ని సిఇవోకి వివరించారు.
సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా శివాజీ సిఇవోను కోరారు.
అనంతరం శివాజీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కుట్ర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. దాడులపై సిఇవోను ప్రశ్నిస్తే సి విజిల్ తమ పరిధిలో ఉండదని చెప్పారన్నారు. సివిజిల్కు ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే సదరు నాయకుడికి ఇంటిపై దాడులు కొనసాగిస్తారని, అది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుందని చెప్పారన్నారు. ఈ విషయాలపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నిందించాల్సిన పని లేదని శివాజీ అన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇటువంటి దాడులు జరుగుతున్నాయా అంటే లేదు, కేవలం ఆంధ్రపదేశ్లో జరుగుతున్నాయని శివాజీ అన్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి ఇవన్నీ చేస్తున్నారని శివాజీ ఆరోపించారు. ఇక్కడ ఒక రాజకీయ పార్టీకి మేలు చేయడానికి కేంద్రం, తెలంణాణ ముఖ్యమంత్రి కెసిఆర్లు దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని శివాజీ దుయ్యబట్టారు.