Six Marriages Case Hyderabad: వయసుంది. తెలివుంది. కొద్దిపాటి అందముంది. వాక్చాతుర్యం ఉంది. వీటన్నిటినీ వాడుకుని మోసం చేసే దుర్భుద్దీ పుట్టింది..! అదే తడవుగా పెళ్లిళ్ల వేట మొదలు పెట్టాడు.. వరుసగా ఆరుగురిని పెళ్లి చేసుకుని, సొత్తు కాజేసి వదిలేసి, ఏడో పెళ్ళికి సిద్ధపడిన సిద్ధహస్తుడి అసలు బాగోతాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. ఓ చిన్న కేసుతో మొత్తం కూపీ లాగి ఇతని పాత నేరాలు, ఘోరాలు మొత్తం చిట్టా తీసి అరెస్టు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ సినిమాటిక్ క్రైమ్ ఘటనపై వివరాలు ఇలా ఉన్నాయి..!
హైదరాబాద్ లోని సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కి ఇటీవల ఒక ఫిర్యాదు వచ్చింది. ఓ యువకుడు తనను పెళ్లి చేసుకుని మోసం చేసి వదిలేశాడని ఓ వివాహిత ఫిర్యాదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా మూలాల్లోకి వెళ్లిన పోలీసులు షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన రంగస్వామి అనే యువకుడు(37) ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. గడిచిన అయిదేళ్ల వ్యవధిలో ఆరుగురు మహిళల్ని పెళ్లి చేసుకుని వదిలేసినట్టు గుర్తించారు. డబ్బున్న ఒంటరి మహిళల్ని చూడడం.., అనాధనని చెప్పడం.., పెళ్లి చేసుకోవడం.. వారి నుండి డబ్బు తీసుకుని వదిలేసి వెళ్లిపోవడం ఇలాగే అయిదేళ్లుగా చేస్తూ వస్తున్నాడు. చివరికి ఓ మహిళ ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితున్ని గోవాలో అరెస్టు చేసారు.
అతని పాత చరిత్ర చూసిన పోలీసులు షాక్ తిన్నారు. రంగస్వామిపై అప్పటికే 12 కేసులున్నాయి. ఓ మహిళపై అత్యాచారం కేసు, దొంగతనం చేసు.. చీటింగ్ కేసులతో సహా రకరాకాల సెక్షన్లలో చాలా కేసులున్నాయి. దీంతో పోలీసులు కొత్తగా ఈ కేసులు నమోదు చేసి అతన్ని రిమండ్ కి తరలించారు. ఇటువంటి వారి పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.