ఒడిశాలో మావోయిస్టులు, పోలీస్ బలగాలకు మధ్య రెండు ప్రదేశాల్లో జరిగిన ఎదురుకాల్పులలో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.
కంధమాల్ జిల్లా సిర్లా అటవీ ప్రాంతంలో 30 నుండి 40 మంది సాయుధ మావోయిస్టులు సమావేశ మయ్యారని, వీరు భారీ దాడులకు వ్యూహం పన్నుతున్నారన్న సమాచారంతో ఎస్ఓజీ జవాన్ లు, కొందమాల్ జిల్లా స్వచ్చంద బలగాలు సంయుక్తంగా అక్కడకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో అప్రమత్తమైన పోలీసులు.. ఎదురుకాల్పులు జరిపారు. గంట పాటు జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా, పలువురు తప్పించుకున్నారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు లలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటనా స్థలంలో ఇన్సాస్ రైఫిల్, నాటు తుపాకీ, వివిధ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టులపై గతంలో ప్రభుత్వం రివార్డు ప్రకటించినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. వీరు బంశధార-ఘుముసారా-నాగావళి (బీజీఎన్) డివిజన్కు చెందిన మావోయిస్టులగా గుర్తించారు.
హతుల్లో ఒకరు రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉన్నట్లు అనుమానిస్తున్నామని, మృతులను గుర్తించాల్సి ఉందని డీజిపి అభయ్ మీడియాకు తెలిపారు. అటవీ ప్రాంతంలో తప్పించుకొని పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా బలంగిరి వద్ద జరిగిన మరో ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారు.