తెలుగు రాష్ట్రాల్లో ఇవేళ ఉదయం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలైయ్యారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మనూరు గేట్ సమీపంలో కారును ఢీసీఎం ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన కేశవులు (35), యాదయ్య (34), శ్రీను (30), లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామస్వామి (32)లు హైదరాబాద్ లో జరిగిన ఓ శుభ కార్యంలో వంట చేసేందుకు వెళ్లారు. వీరు తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా, ప్రమాదం జరిగి మృత్యువాత పడ్డారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంటలు, క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న వీరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో ప్రమాదం ఏపిలోని నెల్లూరు జిల్లాలో జరిగింది.
నెల్లూరు జిల్లా మనుబోలు జాతీయ రహదారిపై కాగితాలవూరు వద్ద ఆటోను వోల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరులో డయాలసిస్ చేయించుకుని తిరిగి వస్తుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతులు చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామానికి చెందిన శ్రీనయ్య, ఈశ్వరయ్య గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్ లను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి .. ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు