Skill Development Corporation Scam Case: స్కిల్ డవలప్మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ ఎదుట నేడి విచారణకు హజరుకావాల్సిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. మరో పక్క ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ రోజు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్కిల్ డవలప్ మెంట్ కార్పోరేషన్ లో రూ.241 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం 26 మందిపై కేసు నమోదు చేయగా లక్ష్మీనారాయణ ఏ 2 గా ఉన్నారు. సదరు కార్పోరేషన్ కు గత టీడీపీ హయాంలో ఆయన డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఏపీ సీఐడీ అధికారులు ఈ నెల 10వ తేదీన ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు పూర్తి అయిన సమయంలో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుంటారన్న భయంలో ఆయన ఆందోళనకు గురైయ్యారు.
Skill Development Corporation Scam Case: ఆసుపత్రి ఐసీయూలోనే లక్ష్మీనారాయణ
అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆయన ఒక్కసారిగా సృహ తప్పిపడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా ఆయన ఆసుపత్రి ఐసీయూలో వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే సోదాలు జరిపిన రోజే సీఐడీ అధికారులు ఆయనను 13వ తేదీ విచారణకు హజరు కావాలని నోటీసు జారీ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ ఎదుట ఆయన హజరు అవుతారా లేదా అన్న మిమాంస కొనసాగుతోంది. మరో పక్క ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేశారు. హైకోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ కేసులో ఏపీ సీఐడీ ముగ్గురుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.