151 మంది ఎమ్మెల్యేలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలా వేగుతున్నాడో ఏమో గాని ఒకే ఒక్క ఎమ్మెల్యే తో జనసేనాని పవన్ కళ్యాణ్ కు రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు.
పవన్ కళ్యాణ్, తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా, రాజోలు లో రాపాక వరప్రసాద్ మాత్రం అనూహ్యంగా గెలిచారు. ‘మా పార్టీ నుంచి గెలిచింది ఒక్కరే అయినా.. అసెంబ్లీలో అధికార పక్షానికి మా సత్తా ఏంటో చూపిస్తాంఅని జనసైనికులు బోల్డంత ఆత్మవిశ్వాసంతో కన్పించేవారు. కానీ, క్రమక్రమంగా రాపాక వరప్రసాద్, వైఎస్సార్సీపీకి దగ్గరయిపోయారు. దీంతో జనసైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు రాపాక పై రగిలిపోయి సోషల్ మీడియాలో తెగరచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉండగానే వారి గుండెలు మరింత మండి౦ప చేసే రాపాక వీడియో ఒకటి బయటకు వచ్చింది.
జగన్ పై తరగని అభిమానం ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో వైసీపీ నుంచి అవకాశం దక్కించుకోలేకపోయాననీ, అందుకే జనసేనలో చేరాననీ, జనసేన నుంచి గెలిచిన వెంటనే వైఎస్ జగన్ని కలిశాననీ, ‘కలిసి పనిచేద్దాం’ అని జగన్ చెప్పారనీ, అప్పటి నుంచీ వైసీపీ నేతగానే చెలామణీ అవుతున్నాననీ ఆ వీడియోలో రాపాక చెప్పుకొచ్చారు. దీంతో ఆయన అసలు నైజం తెలిసిన జనసేన విస్తుపోయింది.‘నేను జనసేన ఎమ్మెల్యేనే.. పవన్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరాను..’ అని మొదట్లో చెప్పిన రాపాక, జనసేనాని మెప్పు కోసం జగన్ మీద విమర్శలు చేసిన రాపాక..
ఇప్పుడిలా ప్లేటు ఫిరాయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు రాపాక గురించి చెప్పడానికి నమ్మకద్రోహం వెన్నుపోటు అన్న పదాలు చాలవని ఆవేశం ఆపుకోలేని జనసైనికులు సోషల్ మీడియాలో ధ్వజమెత్తుతున్నారు.. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రాపాక విషయమై ఏ విధంగానూ స్పందించలేదు. జనసేనాని రెస్పాండ్ అయ్యేసరికి పుణ్యకాలం కూడా పూర్తయి పోతుందని సెటైర్లు కూడా పడుతున్నాయి. పార్టీనే నడపలేడని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేక పోయాడని ఆయన మీద ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో రెచ్చిపోయే ప్రమాదం పొంచి ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?