అర్దరాత్రి వేళ మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి ఓ డిప్యూటి తహశీల్దార్ అక్రమంగా చొరబడి హాల్ చల్ చేయడం రెవెన్యూ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో నివాసం ఉంటున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి వేళ డిప్యూటి తహశీల్దార్ ఆనంద కుమార్ రెడ్డి అక్రమంగా ప్రవేశించాడు. అతన్ని చూసిన స్మితా సబర్వాల్ బిగ్గరగా కేకలు వేయడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. ఆనంద కుమార్ రెడ్డిని ఆమె భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆ సమయంలో భద్రతా సిబ్బందితో అతను దురుసుగా ప్రవర్తించాడు.
ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తే డ్యూటీ విషయంలో మాట్లాడేందుకు వచ్చానని ఆయన చెబుతున్నాడు. డ్యూటీ విషయం మాట్లాడేందుకు అర్ధరాత్రి అక్రమంగా చొరబడాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ పరిణామంతో ఖంగుతిన్న స్మితా సబర్వాల్ వెంటనే జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డిప్యూటి తహశీల్దార్ ఆనంద కుమార్ రెడ్డితో పాటు అతనితో పాటు వచ్చిన స్నేహితుడు బాబుపై కేసు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ అంశం తెలంగాణ రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
సమయస్పూర్తితో రక్షించుకోగలిగాను
ఈ విషయంపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అర్ధరాత్రి తన ఇంట్లోకి ఒ చోరబాటుదారుడు రావడం అత్యంత బాధాకరమని అన్నారు. సమయస్పూర్తిగా వ్యవహరించి అతని నుండి తనకు తాను కాపాడుకున్నానని తెలిపారు. మనం ఎంత సురక్షితంగా ఉన్నామని భావించిన తలుపు తాళాలు సరిగా వేసి ఉన్నాయో లేదో అన్న విషయాన్ని స్వయంగా తనిఖీ చేయాలన్న గుణ పాఠం నేర్చుకున్నట్లు వివరించారు. అత్యవసరమైతే డయల్ 100 కి కాల్ చేయాలని స్మితా సబర్వాల్ సూచించారు. కాగా స్మిత సబర్వాల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితికి నిదర్శనం
మరో పక్క ఈ అంశంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్.. శాంతి భద్రతల పరిస్థితికి నిదర్శనమని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శికే భద్రత లేదని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి గా క్షీణించాయని ఆరోపించారు. మహిళలకు రక్షణ లేకపోవడమే తెలంగాణ మోడలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు.. ఎప్పుడంటే..?