(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమేఠీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీపై ఘన విజయం సాధించిన స్మృతి ఇరానీ అనుచరుడు ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. బరౌలియా గ్రామం మాజీ సర్పంచ్ సురేంద్ర సింగ్ మొన్నటి ఎన్నికలలో స్మృతి ఇరానీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. శనివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు. ఇది రాజకీయ కారణాలతో జరిగిన హత్య కాదని చెప్పేందుకు పోలీసులు సిద్ధంగా లేరు.
రాహుల్ గాంధీని అవమానించేందుకు బరౌలియాలో స్మృతి ఇరానీ చెప్పులు పంచారని ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచారం సమయంలో ఆరోపించినప్పడు ఆ గ్రామం వార్తల్లోకి ఎక్కింది. ఈ హత్యపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని స్థానిక బిజెపి నాయకులు కోరుతున్నారు. హత్యకు రాజకీయాలు కారణం కాదని ఇప్పటికిప్పుడు చెప్పలేమనీ, వ్యక్తిగత శత్రుత్వాల కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందనీ అమేఠీ పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ పేర్కొన్నారు.