పాము పగ పట్టింది అంటే ఏడూ జన్మలు ఎత్తిన వదలదు అంటారు మన పెద్దవాళ్లు. అయితే నిజంగా పాము పగబడుతుందా …. పగ బట్టి కాట్టు వేస్తుందా అనే సందేహాలు చాల మంది లో ఉంటాయి. ఇవి నిజంగానే అంత జ్ఞాపకశక్తి తో మనుషుల్ని వెంటాడి మరి చంపుతాయా అంటే నిజమే అనిపిస్తుంది ఈ కథ చదివితే. మాములుగా పాము కాటు ఒక మనిషిని ఒక్కసారో, రెండు సార్లో కాటు వేసింది అని విని ఉంటాం. కానీ ఓ వ్యక్తిని ఏకంగా 37 ఏళ్లుగా పాములు కాటేస్తున్నాయి. ఏదో పగబడినట్లు ప్రతి ఏటా క్రమం తప్పకుండా కాటు వేస్తున్నాయి. ఇప్పటి వరకు అతడు 37 సార్లు పాము కాటుకు గురయ్యాడు. ఇంకొక విషయం ఏంటి అంటే అతని శరీరంలో రెండు చోట్ల మాత్రమే కాటు వేస్తుంది. ఇది నిజం.అది కూడా ఎక్కడో కాదు… ఏపీలోనే ఆ పాము కాటు బాధితుడు ఉన్నాడు.
వివరాల్లోకి వెళితే.. సుబ్రమణ్యం (42) అనే వ్యక్తిని పాము 37 సార్లు కాటేసింది. నిరుపేద కుటుంబానికి చెందిన సుబ్రమణ్యంకు భార్య, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. సుబ్రమణ్యం ఐదో తరగతి చదువుతున్న రోజుల్లో మొదటిసారి పొలం వద్ద పాము కాటేసింది. అప్పటి నుంచి పాములు పగబట్టినట్లుగా సుబ్రమణ్యంను వెంటాడుతూ ప్రతి ఏటా ఓసారి కాటేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. 37 ఏళ్లలో 37 సార్లు సుబ్రమణ్యం కుడి చేయి, కుడి కాలుపై మాత్రమే నాగుపాములు కాటేస్తుండడం విశేషం. ఒకసారి పాము కాటేసిందంటే కనీసం 10 రోజులు విశ్రాంతి తీసుకోవడంతో పాటు చికిత్స కోసం రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవలే మరోసారి అతడిని పాము కాటేసింది. చికిత్స అనంతరం ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తున్న తనకు ఇంత డబ్బు పాము కాటు చికిత్సకు ఖర్చు చేయడం భారం అవుతుందని వాపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు, సుబ్రహ్మణ్యం.