Social Media: ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో సోమవారం రాత్రి నుండి సోషల్ మీడియా సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రముఖ సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ మూడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఫేస్ బుక్ కు చెందినవే. ఊహించని విధంగా ఒక్క సారిగా ఈ మూడు సోషల్ మీడియా సేవలు నిలిచిపోవడంతో కోట్లాది మంది వినియోగదారులు అయోమయానికి, అసహనానికి గురయ్యారు. అసలు ఏమి జరిగిందో తెలియకపోవడంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ డౌన్ అయ్యింది. దీంతో యూజర్లు వివిధ ఇతర వేదికల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే నెటిజన్ లకు తీవ్ర అసౌకర్యం ఏర్పడటం పట్ల ఫేస్ బుక్ వెంటనే స్పందించింది. క్షమించండి.. ఏదో ఇబ్బంది ఏర్పడింది. మా నిపుణులు లోపాన్ని గుర్తించి సరిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. వీలైనంత త్వరలో సేవలను పునరుద్దరిస్తాం అని ఓ ప్రకటనలో పేర్కొంది.
Social Media: నిలిచిపోయిన సోషల్ మీడియా సేవలతో ఇక్కట్లు
టెలిగ్రామ్, ట్విట్టర్ సేవలు యథావిధిగా పని చేస్తున్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ సేవల అంతరాయంపై చాలా మంది యూజర్లు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. ఇండియాలో సుమారు రాత్రి 9గంటల సమయం నుండి ఈ సమస్య మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో యూజర్లు ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ లో డిలీట్ ఫేస్ బుక్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం మెదలైంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ డౌన్ అవ్వడం జరిగింది. అమెరికా, ఇంగ్లండ్, బ్రెజిల్, కువైట్ వంటి దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
యూజర్లలో అయోమయం
అయితే అసలు ఈ అంతరాయానికి కారణం ఏమిటి అన్నదానిపై మాత్రం ఫేస్ బుక్ ఇంకా స్పందించలేదు. దీంతో వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ సేవలు ఎప్పుడు పునరుద్దరణ అవుతుందో యూజర్ లకు తెలియక తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మరో వైపు వీటిపైనే పని చేసే సంస్థలు ఈ పరిణామంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారతదేశంలో ఫేస్ బుక్ కు 410 మిలియన్ (41 కోట్లు) యూజర్లు ఉన్నారు. ఇక వాట్సాప్ కు దేశ వ్యాప్తంగా 530 మిలియన్ (53 కోట్లు), ఇన్ స్టాగ్రామ్ కు 210 మిలియన్ (21 కోట్లు) యూజర్లు ఉన్నారు. ఈ సేవలు నిలిచిపోవడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతూ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సేవలు నిలిచిపోవడం వల్ల ఆనందించే వారు కూడా కొందరు ఉన్నారు.