ఓ వైపు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య కేసు షాక్ నుంచి ఇంకా బయట పడకముందే కొందరు బాలీవుడ్ నటులను మరో విషయం షాక్కు గురి చేస్తోంది. సుమారుగా 15 నుంచి 20 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో పలువురు బాలీవుడ్ నటీనటులకు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సదరు గూఢచారి సంస్థ ఏజెంట్లు బాలీవుడ్లో ఇప్పటికే పలువురు నటీనటులతో దగ్గరి సంబంధాలను కలిగి ఉన్నారని తెలిసింది. నిఘా వర్గాలు హెచ్చరించినప్పటికీ పలువురు బాలీవుడ్ నటీనటులు సదరు ఏజెంట్లతో చనువుగా ఉంటున్నారని తెలిసింది.
విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. కొందరు బాలీవుడ్ నటీనటులు అమెరికా, కెనడాల్లో గతంలో పలు ఈవెంట్లలో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లలో పాకిస్థాన్కు చెందిన కొందరు నటీనటులు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో వారితో బాలీవుడ్ నటులు అప్పట్లోనే సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. కొందరు పాక్ ఏజెంట్లు నటీనటుల అవతారం ఎత్తి బాలీవుడ్ నటీనటుల్లో కలిసిపోయారని సమాచారం. వారితోనే బాలీవుడ్ నటీనటులు సత్సంబంధాలను కలిగి ఉన్నారని తెలిసింది.
ఆయా ఏజెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని భారత నిఘా వర్గాలు హెచ్చరించినా బాలీవుడ్ సెలబ్రిటీలు పట్టించుకోలేదట. ఈ క్రమంలోనే అమెరికా, కెనడా అధికారులు సదరు ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు కలిగి ఉన్నవారి జాబితాను ప్రస్తుతం సిద్ధం చేస్తున్నారు. ఇక పాకిస్థాన్ మూలాలు ఉన్న అమెరికా జాతీయుడు రెహాన్ సిద్దికీని ఇప్పటికే భారత ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఇతరు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు అత్యంత దగ్గరగా ఉండేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో రెహాన్ సిద్దికీ ఇద్దరు భారతీయులతో కలిసి బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులకు పెద్ద ఎత్తున డబ్బు ఆశ చూపి వారితో అమెరికా, కెనడాల్లో ఈవెంట్లు, షోలు నిర్వహించాడట. ఇక ఆ కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బును ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.