Somu Veerraju : బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను టార్గెట్ చేశారు.
గతంలో బీజేపీలో ఉండి తమ పార్టీ తరపున పోటీ చేసి మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన వెల్లంపల్లి ఇప్పుడు నోరు పారేసుకుంటున్నారని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు.గతాన్ని మరిచిపోవద్దని ఆయన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి సలహా ఇచ్చారు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆలయాల్లో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తామంతా పెద్దఎత్తున ఉద్యమించామని వీర్రాజు తెలిపారు.అప్పట్లో తమ పార్టీలోనే ఉన్న వెల్లంపలిశ్రీనివాస్ ఆరోజున బిజెపి ఏమీ చెయ్యలేదని ఇప్పుడు విమర్శించటం సరికాదన్నారు.అప్పట్లో విజయవాడలో ఆలయాల సందర్శన చేసి గోక్షేత్రం వద్ద ఒక బహిరంగ సభ పెట్టుకోగా ఆ పక్కనే ఉన్న ఇంట్లో నివసించే టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తమపై గొడవకు దిగటం కూడా జరిగిందన్నారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ ఆ వివాదాన్ని సమసిపుచ్చారన్నారు.ఇదంతా వెల్లంపలిశ్రీనివాస్ కు తెలుసన్నారు.ఇప్పుడు మంత్రికాగానే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్ని మర్చిపోయినట్టు నటిస్తుంటే తాను గుర్తు చేస్తూనే ఉంటానని వీర్రాజు చెప్పారు. చంద్రబాబు అంటే తమకు ప్రత్యేక ప్రేమ లేదన్నారు.నిజానికి చంద్రబాబు అప్పుడు బీజేపీ ఆలయాలకు సంబంధించి అడిగినవి ఏమీ చేయలేదని ఈ విషయంలో జగనే మేలని ,దెబ్బతిన్న ఆలయాలు,విగ్రహాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
Somu Veerraju : సీఎం జగన్ పై పరోక్ష చురకలు!
కాగా వైసిపి నేతలు బిజెపిని నోటా పార్టీ అంటూ చులకన చేసి మాట్లాడుతున్నారని..అలాంటి నోటా పార్టీకి ఎందుకు అధికారపార్టీ భయపడిపోతోందని అని ప్రశ్నించారు.మీ నాయకుడు రోజూ ఢిల్లీలో మా పార్టీ నాయకులతో టచ్ లోనే ఉంటారని వీర్రాజు వైసిపి నేతలకు చురక వేశారు.కేంద్రంలో మా పార్టీ అధికారంలో ఉందని మర్చిపోవద్దని కూడా సోము వీర్రాజు వార్నింగ్ ఇచ్చారు.కాగా కాగా బిజెపి అధికారంలోకి వస్తే బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారని తాను చెప్పలేదన్నారు .ఇదంతా మీడియా సృష్టేనని ఆయన తెలిపారు.రాష్ట్ర రాజకీయాల్లో బీసీలు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని మాత్రమే తాను అన్నట్లు సోము వీర్రాజు వివరణ ఇచ్చారు.తిరుపతి ఉప ఎన్నిక విషయంలో కసరత్తు జరుగుతోందని త్వరలోనే అభ్యర్థి విషయంలో క్లారిటీ ఇస్తామని ఆయన మరో ప్రశ్నకు బదులిచ్చారు..