ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడంతా మనోభావాల గురించే చర్చ. కొందరి మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటుంటే… మరికొందరు దానిపై విభిన్నంగా స్పందిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన ఘటనతో వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. సీబీఐ దర్యాప్తు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతించాయి. అయితే అంతర్వేది రథం దగ్ధంపై ఇప్పటికీ దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు.
గవర్నర్ తో కాక పెంచుతున్నారా?
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అపాయిట్మెంట్ను బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు తీసుకున్నారు. విజయవాడలో నేడు ఉదయం 11.30కి గవర్నర్ను సోము వీర్రాజు కలవనున్నారు. బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం, అంతర్వేది రథం దగ్ధం, ఇతర ఆలయాలలో జరిగిన ఘటనలను గవర్నర్ కు సోము వీర్రాజు వివరించనున్నారు. ఈ ఘటనల విషయంలో చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేసిన వారిని పోలీసులు అరెస్టులు చేసిన ఉదంతంపై ప్రధానంగా ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. అక్రమంగా కేసులు పెట్టి, అరెస్టు చేసిన వారి వివరాలు, దాడుల పట్ల ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఆధారాలతో గవర్నర్ కు సోము వీర్రాజు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
సెంటిమెంట్తో కొడుతున్నారే
“ఏపీ బీజేపీ రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టబోతోంది“ అంటూ బీజేపీ ఏపీ అద్యక్షుడుగా కన్నా లక్ష్మినారాయణ స్థానంలో నియమాకం అయిన తర్వాత సోము వీర్రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి. . ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు జనసేనతో కలసి తామే మూడవ ప్రత్యామ్నాయంగా వస్తామనీ, 2024లో తమ కూటమి అభ్యర్థికే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ప్రకటించేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీని నాశనం చేయాలని ప్రయత్నించారనీ, తాము కూడా ఆయనను ఆవిధంగానే చూస్తామని సోము వీర్రాజు అన్నారు. అధికార వైసీపీని సైతం అదే రేంజ్లో టార్గెట్ చేస్తామని వెల్లడించారు.
ఈ రూట్లో నరుక్కు వస్తున్నారా?
బాధ్యతలు స్వీకరించిన సమయంలో పార్టీ నేతల్లో జోష్ పెంచేందుకే అలా మాట్లాడారు అంటూ…మొదట్లో సోము వీర్రాజు మాటలను ఏపీ ప్రజలు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అయితే, ఇప్పుడు మాత్రం బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెక్కలు మారుతున్నాయంటున్నారు. తాజా పరిణాలే దీనికి కారణమని చెప్పుకొస్తున్నారు. పార్టీ తప్ప మరేమీ పట్టని సోము వీర్రాజుకు బీజేపీ రథసారథిగా పట్టం కట్టిన తర్వాత సోము వీర్రాజు మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్లో లెక్కలు ఇవే
ఆంద్రప్రదేశ్లో ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న ఘటనలు అనేకమంది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారును ఇరకాటంలో పడేస్తున్నాయి. ఇందులోకి హిందూ మతంపై నిర్లక్ష్యం అనే భావన సైతం ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఉన్న భావన ను బీజేపీ వైపు మరలించేందుకు వీర్రాజు పావులు కదుపుతున్నట్లు చెప్పుకొస్తున్నారు.