Sonu Sood: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరికీ అంతుపట్టదు.అత్యుత్సాహంతో కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు తమ దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని పోస్ట్ చేసేసి ఆనందిస్తుంటారు.ఇందులో నిజమెంత, అబద్ధమెంత అన్నది కూడా వారు వెరిఫై చేసుకోరు.అలాంటిదే ఒక నిరాధారమైన పోస్టింగ్ ఒకటి తాజాగా వైరల్ అయింది.అది కరోనా దేవుడు సోనుసూద్ కు సంబంధించింది కావడంతో అందరి దృష్టిలో పడింది.చివరకు విషయం తెలుసుకున్న సోనుసూద్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ఆ పోస్టింగ్ ఏంటంటే!
సోనూసూద్ మూడు కోట్ల రూపాయలు ఖరీదు చేసే విలాసవంతమైన ఒక కారును కొనుగోలు చేశాడని, దాన్ని తన కుమారుడు ఇషాన్ కు ఫాదర్స్ డే సందర్భంగా కానుకగా ఇచ్చాడని సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ వచ్చింది.ఈ మధ్యే ఇషాన్ కి పద్దెనిదేళ్లు నిండాయి.అప్పట్లో ఇవ్వకుండా ఈ రోజున ఆ కారును కుమారుడికి గిఫ్ట్ గా ఇవ్వడానికి సోనూసూద్ సిద్ధం చేశాడని ఆ పోస్టింగు లో పేర్కొన్నారు.సోనూ సూద్ బంగ్లా ఆవరణలో ఉన్న కారు ఫోటోను కూడా పోస్ట్ చేశారు.ఇది ఆదివారం నెటిజన్లకు ఆహారకరమైన వార్తగా మారింది.
అదంతా ఫేక్ !అసలు వాస్తవం ఇదీ!!
దీంతో సోనూసూద్ తనదైన శైలిలో స్పందించారు.ఆ కారును తాను కొనుగోలు చేయలేదని, టెస్ట్ డ్రైవ్ కోసం మాత్రమే తీసుకొచ్చి ఇంట్లో పెట్టానని ఆయన వివరణ ఇచ్చారు.ఒకసారి కుటుంబమంతా టెస్ట్ డ్రైవ్ కి వెళ్లి వచ్చామన్నారు.జరిగింది ఇది అయితే ఇందుకు భిన్నమైన వార్తలు వచ్చాయన్నారు.అదే సమయంలో ఆయన నెటిజన్లకు ఒక సూటి ప్రశ్న వేశారు.”ఫాదర్స్ డే సందర్భంగా నేనెందుకు కుమారుడికి కానుక ఇస్తాను..అసలు ఫాదర్స్ డే నాడు తండ్రికి కానుక ఇవ్వాల్సింది కుమారుడు కాదా” అని సోనూసూద్ సోషల్ మీడియాను నిలదీశారు.ఇలాంటి దుష్ప్రచారాలు తననేమీ బాధించబోవన్నారు.కరోనా సహాయక చర్యలకు సోనూసూద్ కి డబ్బెక్కడ్నించి వస్తుందని కూడా కొందరు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.అన్నిటికీ తన వద్ద సమాధానాలు ఉన్నాయన్నారు.ఎవరైనా అడ్డు పడాలనుకున్నా తనను ఆపలేరని ,ఆపన్నులకు సాయం అందిస్తూనే ఉంటానని సోనూసూద్ స్పష్టం చేశారు.