సోనూసూద్.. అది ఒక పేరు మాత్రమే కాదు.. ఒక శక్తి. ఒక భరోసా. ఒక నమ్మకం. సోనూసూద్ పేరు వింటే చాలు.. మనసుకు హాయిగా ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే.. ఆదుకునే ఒక వ్యక్తి ఉన్నాడు.. అని అనిపిస్తుంది సోనూసూద్ ను చూస్తే. దేవుళ్లు మనుషుల రూపంలో ఉంటారు అనేది సోనూసూద్ ను చూసి నేర్చుకోవచ్చు.
లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు తమ సొంతూళ్లకు వెళ్లలేక కష్టాలు పడుతుంటే వెంటనే తన వంతు సాయంగా వలస కూలీలకు సపరేట్ రైళ్లు, బస్సులు, విమానాలు వేయించి వాళ్ల ఊళ్లకు పంపించారు సోనూసూద్. దీంతో ఆయనలో ఉన్న సాయ గుణం బయటపడింది.అప్పటి నుంచి ఇప్పటి వరకు సోనూసూద్.. తనకు తోచిన సాయం చేస్తూనే ఉన్నారు. ఎవరికి ఏం కావాలన్నా అది ఇస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన వందల మందికి సాయం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.
తాజాగా మరోసారి తన ఉదార స్వభావాన్ని సోనూసూద్ చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన హర్షవర్ధన్ అనే 6 ఏళ్ల బాలుడికి 20 లక్షల సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నారు.హర్షవర్ధన్ అనే బాలుడు కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ బాలుడికి కాలేయ మార్పిడి చేయాల్సి ఉంది. దానికి కనీసం 20 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పడంతో… ఏం చేయాలో తెలియని ఆ బాలుడి తల్లిదండ్రులు హైదరాబాద్ లో సోనూసూద్ ను కలిశారు. తమ సమస్యను ఆయనకు విన్నవించుకున్నారు.
ఆ బాలుడి కష్టం చూసిన సోనూసూద్ చలించిపోయారు. వెంటనే బాలుడి వైద్యానికి అయ్యే ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు.హర్షవర్ధన్ పుట్టినప్పటి నుంచి కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. అప్పటి నుంచి ఆ బాలుడికి చికిత్స చేయిస్తున్నా తగ్గడం లేదు. ఇప్పుడు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆపరేషన్ కు 20 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో తమ దగ్గర అంత స్తోమత లేకపోవడంతో.. ఎలాగైనా సోనూసూద్ ను కలవాలని అనుకున్నారు.
హైదరాబాద్ కు షూటింగ్ కోసం సోనూసూద్ వస్తున్నారని తెలుసుకొని.. ఆయన దగ్గరికి వెళ్లి కలిశారు. వెంటనే స్పందించిన సోనూ సూద్.. బాలుడి వైద్య ఖర్చులు తానే భరిస్తానని.. బాలుడిని అపోలో ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు. తమ కొడుకుకు పునర్జన్మను ప్రసాదించిన సోనూసూద్ కు వాళ్లు ధన్యవాదాలు తెలిపారు.