సోనూసూద్ లో నిజమైన హీరో ఉన్నాడని ఆయన సినిమాల్లో మాత్రమే విలన్ అనే విషయం కరోనా వల్ల బయటపడింది. లాక్ డౌన్ లో వలస కూలీలను తన సొంత ఖర్చులతో వాళ్ల సొంతూళ్లకు పంపించి.. అందరి మనసును గెలిచిన సోనూసూద్.. అప్పటి నుంచి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూనే ఉన్నారు. తనకు తోచిన సాయం చేస్తూనే ఉన్నారు. ఎవరు సాయం కోసం తన దగ్గరికి వచ్చినా వెంటనే సాయం అందిస్తున్నారు.
ఇటీవల కూడా ఆయన చేసిన ఆర్థిక సాయాల గురించి చదివాం. తాజాగా ఆయన మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కరోనా వల్ల ప్రస్తుతం పాఠశాలలన్నీ ఆన్ లైన్ లో పాఠాలను బోధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హర్యానాలోని మొర్ని ప్రాంతంలో ఓ విద్యార్థి ఆన్ లైన్ క్లాసెస్ వినడం కోసం చెట్టు ఎక్కాల్సి వచ్చేసింది. ఎందుకంటే.. ఆ ఊళ్లో మొబైల్ నెట్ వర్క్ సరిగ్గా ఉండదు. దీంతో చెట్టు ఎక్కితే కానీ సిగ్నల్ అందని పరిస్థితి. చెట్టు ఎక్కి నెట్ వర్క్ వస్తే.. దాని ద్వారా ఇంటర్ నెట్ ను యాక్సెస్ చేసి అప్పుడు ఆన్ లైన్ క్లాసెస్ వినేవాడు. కానీ.. అది చాలా డేంజర్ కదా. ప్రతి రోజు ఇలా చెట్టు ఎక్కడం.. చెట్టు మీద క్లాసులు వినడం అనేది చాలా ఇబ్బంది.
ఈ విషయం ట్విట్టర్ ద్వారా సోనూసూద్ కు తెలిసింది. వెంటనే సోనూసూద్. ఆ గ్రామ పెద్దలతో మాట్లాడారు. ఎయిర్ టెల్ కంపెనీతో కూడా మాట్లాడి అక్కడ వెంటనే ఎయిర్ టెల్ టవర్ ను స్థాపించేలా చర్యలు తీసుకున్నారు. ఎయిర్ టెల్ టవర్ స్థాపనకు అయ్యే ఖర్చులన్నీ సోనూసూదే భరించారట.
చాలా ఏళ్ల నుంచి మా ఊళ్లో మొబైల్ టవర్ కోసం ఎదురు చూస్తున్నాం. ఫోన్ చేయాలంటే చాలా సమస్యగా ఉండేది. వేరే ఊళ్లోకి వెళ్లి ఫోన్ చేయడం లేదంటే.. చెట్లు, గుట్టలు ఎక్కి ఫోన్ చేసేవాళ్లం. ఎవ్వరూ పట్టించుకోలేదు. మీరు వచ్చి మా ఊళ్లో టవర్ వేయించారు.. ఇప్పుడు మా ఇంట్లో నుంచే ఫోన్లు మాట్లాడుకోవచ్చని ఆ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటుగా.. రియల్ హీరో సోనూసూద్ కు ధన్యవాదాలు తెలిపారు.