కరోనా టెస్టులను చేసేందుకు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీ పీసీఆర్తోపాటు ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటి వల్ల కరోనా ఫలితం ఆలస్యంగా తెలుస్తుంది. ర్యాపిడ్ టెస్ట్ కిట్తో ఫలితం వచ్చినప్పటికీ అది కచ్చితంగా ఉంటుందని చెప్పలేం. మళ్లీ ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తోంది. ఇక ఆ టెస్ట్ రిజల్ట్ వచ్చేందుకు చాలా సమయం పడుతోంది. అయితే ఇకపై కేవలం ఒక నిమిషం వ్యవధిలోనే అత్యంత కచ్చితత్వంతో కరోనా టెస్ట్ రిజల్ట్ వచ్చేలా భారత్, ఇజ్రాయెల్ సైంటిస్టులు సంయుక్తంగా ఓ నూతన టెస్ట్ కిట్ను అభివృద్ధి చేశారు.
కోవిడ్ టెస్ట్లను చేసేందుకు ప్రస్తుతం బాధితుల నుంచి ముక్కు ద్వారా శాంపిళ్లను సేకరిస్తున్నారు. అయితే భారత్, ఇజ్రాయెల్ సైంటిస్టులు డెవలప్ చేసిన కొత్త టెస్ట్ కిట్తో కరోనా టెస్టులు చేసేందుకు బాధితుల ఉమ్మిని సేకరిస్తారు. అందుకు గాను వారు నోట్లో ట్యూబ్ను పెట్టుకుని దాంట్లోకి ఉమ్మిని వదలాలి. దీంతో ఆ ఉమ్మిని టెస్ట్ కిట్లో ఉంచి టెస్ట్ చేస్తారు. దాంతో కేవలం 1 నిమిషంలోనే కరోనా టెస్ట్ రిజల్ట్ వస్తుంది.
అయితే సదరు నూతన తరహా టెస్ట్ కిట్ను మరో 3 వారాల్లోగా దేశంలో అందుబాటులోకి తెస్తామని సైంటిస్టులు వెల్లడించారు. కాగా ఈ టెస్ట్ కిట్ ద్వారా ఇప్పటికే దేశంలో పలు చోట్ల 25వేలకు పైగా శాంపిల్స్ను సేకరించి ముందస్తుగా పరీక్షలు నిర్వహించామని, వాటిల్లో ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయని, కనుక ఆ కిట్కు మార్పులు చేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వైద్యులు తెలిపారు.
కొత్త టెస్ట్ కిట్ అందుబాటులోకి వస్తే పబ్లిక్ ప్లేసుల్లో ఎవరినైనా సరే టెస్ట్ చేసి చాలా వేగంగా కోవిడ్ ఉందో, లేదో నిర్దారించవచ్చని, దీంతో కోవిడ్ వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చని సైంటిస్టులు తెలిపారు. కాగా సదరు కొత్త టెస్ట్ కిట్ను ఇజ్రాయెల్కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టరేట్, భారత్ కు చెందిన డీఆర్డీవో, సీఎస్ఐఆర్ సంస్థలు కలిసి రూపొందించాయి.