దక్షిణాదిలో హీరోయిన్ సౌందర్య కు చాలామంది అభిమానులు ఉన్నారు. సౌందర్య తెలుగు ప్రేక్షకులలో “మహానటి సావిత్రి ని తలపించేలా నటించారు” అన్న పేరుని సంపాదించుకున్నారు. తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతాగానో అలరించారు. కానీ సౌందర్య చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు . ఇటీవల యూట్యూబ్ లో “పరుచూరి పలుకులు” అనే కార్యక్రమం లో వెంకీమామ చిత్రం గురించి మాట్లాడుతూ ఆయన సౌందర్య తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
“అంత చిన్న వయసులోనే సౌందర్య 100 పైగా సినిమాల్లో నటిస్తే అందులో 8 సినిమాలకు మేము మాటలు రాశాం. నాకు సౌందర్య ని చూసినప్పుడల్లా ఇలాంటి ఓ చెల్లీ ఉంటే ఎంత బాగుండేది అని అనుకునేవాడిని. 1993లో ఆమె చిత్రం ‘ఇన్స్పెక్టర్ ఝాన్సీ’ కోసం మేము తొలిసారిగా కలిసి పనిచేశాం. ఆమెలో ఉన్న వినయం ఆ సమయంలోనే నాకు చాలా నచ్చింది. ఆమె పెద్దలకు ఇచ్చే గౌరవాన్ని చూసి మేము ఆశ్చర్యపోయేవాళ్ళం.”
“సౌందర్య మరణాన్ని నేను ఎప్పటికి మరచిపోలేను. నేను డాక్టర్రేట్ అందుకోవాలన్నది మా అమ్మ కల. అందుకే నేను సాహిత్యంలో పీహెచ్డీ చేశాను. నేను 2004 ఏప్రిల్ 17న ఉస్మానియా యూనివర్సిటీ లో సాహిత్యంలో డాక్టరేట్ అందుకోవడానికి కి వెళ్ళాను. అదే సమయంలో అక్కడికి ఓ విలేకరి వచ్చి హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారనే హృదయ వికారమైన వార్తను నాకు చెప్పారు. ఆ వార్త ను వినగానే నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆ రోజు ఆమె బాడ్ లక్ ఎంతగా ఉందంటే సౌందర్య ఆరోజు విమానంలో రావాల్సి ఉంది. కానీ, ‘ఆప్తమిత్ర’ (తెలుగులో నాగవల్లి) మూవీ షూటింగ్ కారణంగా ఆమె ఎక్కాల్సిన విమానం మిస్ అయింది. ఇక చేసేదేమి లేక ఆమె హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమయ్యారు. ఆ రోజు ఆమె షూటింగు నుంచి త్వరగా వచ్చి విమానాన్ని అందుకున్నట్లయితే ఈరోజున ఆమె బతికే ఉండేవారు’’ అని చెబుతూ పరుచూరి గోపాలకృష్ణ బాగా ఎమోషనల్ అయ్యారు.