దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆరోగ్యం విషయంలో మరోసారి ఆందోళన నెలకొన్న విషయం తెల్సిందే. గత నెల 5న కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజిఎం ఆసుపత్రిలో చేరిన ఎస్పీబీను అదే నెల 13న ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ పై ఉంచారు. అప్పటినుండి ఆయన పోరాడుతూ క్రమంగా కోలుకుంటున్నారు.
రోజురోజుకూ ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందన్న వార్తలతో అందరూ ఊపిరి పీల్చుకుంటే నిన్న ఎంజిఎం ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ మరోసారి ఆందోళన రేకెత్తించింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆరోగ్యం విషమించిందని వారు తెలిపారు. నిన్న అర్ధరాత్రి మరో హెల్త్ బులెటిన్ వస్తుందని అందరూ ఎదురుచూసారు కానీ అటువంటిది ఏం జరగలేదు. నిన్న సాయంత్రమే ఎస్పీ కుటుంబం ఆసుపత్రికి చేరుకొని అక్కడే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మరికొద్ది సేపట్లో ఆయన ఆరోగ్యం విషయంలో కుటుంబం మీడియాతో మాట్లాడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.