ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ నెల 5న లెజండరీ సింగర్ ఎస్పీ బాలు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెల్సిందే. లక్షణాలు తక్కువగానే ఉన్నాయని బాలసుబ్రహ్మణ్యం ఒక వీడియో విడుదల చేసి చెప్పారు.
ముందు జాగ్రత్త కోసం ఆసుపత్రిలో జాయిన్ అయ్యానని, పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతానన్న విశ్వాసం వ్యక్తం చేసారు బాలు. అయితే ఇప్పుడు బాలు ఆరోగ్యం మరింత క్షీణించినట్లుగా తెలుస్తోంది. బాలసుబ్రహ్మణ్యం జాయిన్ అయిన ఎంజిఎం ఆసుపత్రి యాజమాన్యం బులిటెన్ ను విడుదల చేసింది. 13న అర్ధరాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించింది. మా మెడికల్ టీమ్ సూచన మేరకు ఆయనను ఐసీయూకు షిఫ్ట్ చేసాం. ప్రస్తుతం ఆయనకు లైఫ్ సపోర్ట్ అందజేస్తున్నామని తెలిపింది. ప్రత్యేక వైద్య టీం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోందని వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలియటంతో కుమారుడుతో పాటుగా తమిళ..తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆస్పత్రి వర్గాలతో మాట్లాడుతున్నారు. బాలు వయసు 74 సంవత్సరాలు కావటంతో..వయసు రీత్యా వస్తున్న ఆరోగ్య సమస్యలు సైతం ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో..సినీ రంగ ప్రముఖులతో పాటుగా అభిమానులంతా ఆయన ఆరోగ్యంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం నిపుణుల బృందం ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తోంది.