కేటీఆర్ త్వరలోనే సీఎం అవుతారని మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసబెట్టి కోరస్ పాడుతున్నారు. కొందరు ఏకంగా అడ్వాన్స్ గ్రీటింగ్స్ కూడా చెప్పేస్తున్నారు.
ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు ఎప్పుడు చేపడతారనే ఊహాగానాలతోపాటు ఆయన కేబినెట్లో మంత్రులుగా ఎవరుంటారు? ఈసారి కీలక బెర్త్లు ఎవరికి దక్కుతాయి? అనే చర్చ అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. ఫలానా ఎమ్మెల్యేలకు ఫలానా మంత్రి పదవులు వస్తాయని చర్చించుకుంటున్నారు. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో ఉన్నట్టుగా కేటీఆర్ కేబినెట్ లో కూడా డిప్యూటీ సీఎం పదవి ఉంటుందని చెప్తున్నారు. కొందరు సిట్టింగ్ మంత్రులను కంటిన్యూ చేయాలని స్వయంగా కేసీఆర్ రికమెండ్ చేస్తారని, మిగతా మంత్రుల ఎంపికను కేటీఆర్ ఇష్టానికి వదిలేస్తారని అంటున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ దృష్టిలో పెట్టుకొని ఏ జిల్లా నుంచి ఏ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తారో లీడర్లు లెక్కలు తీస్తున్నారు. ప్రస్తుత మంత్రులందరికీ కేటీఆర్ కేబినెట్లో చోటు దక్కకపోవచ్చని చెప్తున్నారు. ఇద్దరు ముగ్గురు మినహా మిగతా వారిని పక్కన పెడ్తారని, ఆ ప్లేస్లలో అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులను కేటీఆర్ కేబినెట్ లోకి తీసుకుంటారని లీడర్లు భావిస్తున్నారు.కేటీఆర్ కేబినెట్ లో ఆయన చెల్లెలు కల్వకుంట్ల కవితకు చాన్స్ ఉంటుందా? లేదా? అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అధికార మార్పిడి జరిగితే మంత్రి పదవి కావాలని కవిత పట్టుపడుతున్నట్లు ప్రచారంలో ఉంది. దీంతో ఆమెకు బెర్త్ ఖాయమేనని కొందరు లీడర్లు అనుకుంటున్నారు.
డిప్యూటీ సీఎంగా ఈటెల?
కేటీఆర్ ను సీఎం సీట్లో కూర్చోపెడ్తే మంత్రి ఈటల రాజేందర్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సీఎం పదవిని కొడుకుకు కట్టాబెట్టారనే విమర్శలకు చెక్ పెట్టేందుకు బీసీ నాయకుడైన ఈటలను డిప్యూటీ సీఎంగా చేసే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు లీడర్లు చెప్తున్నారు. ఈటలకు హెల్త్ శాఖ కంటే మెరుగైన పోర్ట్ పోలియో దక్కవచ్చని అంటున్నారు. అయితే డిప్యూటీ సీఎం పదవిపై కేటీఆర్ కు అత్యంత సన్నిహిత మంత్రిగా ముద్రపడ్డ శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా ప్రచారంలో ఉంది.
ఇంకెవరెవరికి ఛాన్స్!
కేటీఆర్ సీఎం బాధ్యతలు స్వీకరిస్తే ఇప్పుడున్న కేబినెట్ రద్దవుతుంది. దీంతో మార్పులు చేర్పులు తప్పనిసరవుతాయి. రాష్ట్ర కేబినెట్ లో సీఎంతో పాటు 17 మందిని మంత్రులుగా నియమించుకునే చాన్స్ ఉంటుంది. హరీశ్ రావు, ఈటల రాజేందర్, కవితకు బెర్త్లు ఖరారైతే… మిగిలిన 14 స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై టీఆర్ఎస్లో పలు రకాలుగా చర్చలు నడుస్తున్నాయి. దళితుడిని సీఎం చేయాలనే డిమాండ్ వస్తున్నందున ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి, ఒక ముస్లింకు కేబినెట్లో చాన్స్ ఖాయమని లీడర్లే చెప్తున్నారు. మైనారిటీ కోటాలో మంత్రి పదవి బోధన్ ఎమ్మెల్యే షకీల్ను వరిస్తుందనే ప్రచారం మొదలైంది. ఎస్సీ కోటాలో మినిస్టర్ పదవి కోసం బాల్క సుమన్, చంటి క్రాంతి కిరణ్ ట్రై చేసే చాన్స్ ఉంది. గువ్వల బాలరాజు కూడా పోటీలో ఉంటారని పార్టీ లీడర్లు అంటున్నారు. ఎస్టీ కోటాలో కూడా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మిగతా 11 మందిలో ప్రధానంగా కేటీఆర్ కోటరీగా ముద్రపడ్డ ఎమ్మెల్యేలకు అవకాశం దక్కవచ్చని లీడర్లు చెప్తున్నారు.
ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ తోపాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదవులపై ధీమాతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈ మధ్య దూకుడు పెంచినట్టు లీడర్లు చెప్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందాగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పోటీ పడ్తారని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి చాన్స్ ఉంటుందనే టాక్ మొదలైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రస్తుత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా నుంచి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన చీఫ్ విప్ వినయ్ భాస్కర్ రేసులో ఉంటారని లీడర్లు భావిస్తున్నారు. కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ కూడా పోటీలో ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
కేటీఆర్కు సన్నిహితుడిగా పేరున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా కేబినెట్లోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారనే ప్రచారం నడుస్తోంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేరు కూడా వినిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి రేఖా నాయక్ కు, మెదక్ జిల్లా నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని లీడర్లు అంటున్నారు. మహబూబ్ నగర్ నుంచి మాజీ మం త్రి లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్న వినోద్ కుమార్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని లీడర్లు అంటున్నారు. కేటీఆర్ కేబినెట్ లో వెళ్లేందుకు పద్మారావుకు చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కేబినెట్ లో కొనసాగుతారని అంటున్నారు.