Sputnik V Vaccine: ప్రస్తుతం దేశంలో కోవ్యాక్సిన్, కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం ఈ రెండు వ్యాక్సిన్ లను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపుతోంది. ఇప్పుడు తాజాగా భారత్ మార్కెట్ లోకి రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ – వి అందుబాటులోకి వచ్చేసింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సహకారంతో గమలేయా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకా వినియోగానికి భారత ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
భారత్ లో స్పుత్నిక్ వీ ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు ఆర్డీఐఎఫ్ తో ఒప్పందం చేసుకున్న డాక్టర్ రెడ్డీస్ (హైదరాబాద్) కు రష్యా నుండి తొలి విడతలో దాదాపు 1.5లక్షల డోసులు చేరాయి. వీటి పంపిణీకి సెంట్రల్ డ్రగ్స్ లాబోరేటరీ నుండి ఈ నెల 13న అనుమతి రాగా తొలి డోస్ ను శుక్రవారం సంస్థ ప్రారంభించింది. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ సంస్థ స్పుత్నిక్ వీ డోస్ ధరను వెల్లడించింది. ఒక్క డోసు ధర రూ.948గా నిర్ణయించింది. అయితే దీనికి అయిదు శాతం జీఎస్టీ కలిపితే వ్యాక్సిన్ ఒక డోసు ధర రూ.995.40 పైసలుగా పేర్కొన్నది. ప్రస్తుతం ఈ ధర నిర్ణయించినప్పటికీ స్థానికంగా పంపిణీ పెరిగిన అనంతరం వ్యాక్సిన్ ధర తగ్గే అవకాశం ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్ లో డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది.
తొలుత డాక్టర్ రెడ్డీస్ సంస్థ దాదాపు 10 కోట్ల డోసులను పంపిణీ చేయనుంది. అయితే స్థానికంగా ఉత్పత్తి మాత్రం జూలై నెల నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో టీకా డోసులను రష్యా నుంచే నేరుగా దిగుమతి చేసుకుంటుంది. కాగా స్పుత్నిక్ వీ టీకా ప్రభావశీలత 91 శాతం కలిగి ఉన్నట్లు క్లినికల్ ప్రయోగాల్లో తేలింది. ఈ టీకాను మూడు వారాల వ్యవధిలో వ్యవధిలో రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది.