కర్నూలు, ఏప్రిల్ 4: సీనియర్ నాయకుడు, నంద్యాల జనసేన అభ్యర్థి, సిటింగ్ ఎంపీ ఎస్పివై రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా తిరుగుతున్న ఆయన అస్వస్థులు కావడంతో కుటుంబ సభ్యులు హుటాహటిన హైదరాబాద్కు తరలించారు. హైదరాబాదులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
గత ఎన్నికల్లో నంద్యాల నుండి వైసిపి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన ఎస్పివై రెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేయకముందే తెలుగుదేశం పార్టీలో చేరారు.
అప్పటి నుంచి టిడిపిలో కొనసాగుతున్న ఆయనకు టిడిపి అధిష్టానం ఈ ఎన్నికల్లో నంద్యాల టికెట్టు ఖరారు చేయలేదు. దీంతో ఆయన మనస్థాపానికి గురై జనసేన పార్టీలో కుటుంబంతో సహా చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో నంద్యాల నుంచి నాల్గవ పర్యాయం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఎస్పివై రెడ్డి బరిలో ఉండటం వల్ల ఓట్లు చీలిపోయి టిడిపి అభ్యర్థికి నష్టం చేకూరుతుందని భావించిన టిడిపి అధినేత చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన మనసు మార్చుకోలేదు. నంద్యాల పార్లమెంట్ నుండి మరో సారి విజయం సాధించి తన తఢకా ఏమిటో పార్టీకి చూపించాలని విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ అస్వస్థతకు గురయ్యారు.