మౌనరాగం ఫేమ్ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు మిస్టరీని తలపిస్తోంది. మధురానగర్ లోని తన ఇంట్లో బాత్ రూమ్ లో శ్రావణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. అయితే దీనికి గల కారణాలను పోలీసులు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ విచారణలో దేవరాజ్ చెప్పిన సంగతులు కొన్ని షాకింగ్ గా అనిపించాయి. ఆరెక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డితో సహజీవనం కోసం సాయి కృష్ణ అనే వ్యక్తి శ్రావణిని తీవ్రంగా వేధించాడని అందువల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ తెలిపాడు. ఇందుకు తగిన కొన్ని ఆధారాలను కూడా చూపించినట్లు తెలుస్తోంది. ఈ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి సాయి కృష్ణ, దేవరాజ్ దే నేరం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. కావాలని తను తప్పించుకోవడానికి దేవరాజ్ అశోక్ రెడ్డిని ఇరికించాడని, ఈ కేసుతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపాడు సాయికృష్ణ.
టిక్ టాక్ ద్వారా శ్రావణిని పరిచయం చేసుకున్న దేవరాజ్ ఆమెను మోసం చేసాడని, తీవ్రంగా వేధించాడని సాయి కృష్ణ తెలియజేసాడు. ఈ విషయమై తీవ్రంగా మనస్థాపం చెంది శ్రావణి ఆత్మహత్య చేసుకుందని అంటున్నాడు. ఇక శ్రావణి తల్లి రత్నం కూడా ఈ కేసు విషయంలో కీలక స్టేట్మెంట్ ఇచ్చింది. శ్రావణిని ప్రేమ పేరుతో దేవరాజ్ మోసం చేసాడని రత్నం అంటున్నారు. జూన్ లో కేసు కూడా నమోదు చేశామని అప్పుడు పెద్ద డ్రామా చేసాడని ఆమె అంటున్నారు. అలాగే శ్రావణి బాత్ రూమ్ లోకి వెళ్లిన కాసేపటికే దేవరాజ్ నుండి ఫోన్, మెసేజ్ వచ్చాయని రత్నం తెలిపారు. దేవరాజ్ ఆరోపిస్తున్నట్లుగా సాయికృష్ణకు ఆత్మహత్యతో సంబంధం లేదని ఆమె అంటున్నారు. దేవరాజ్ అఘాయిత్యం చేస్తాడన్న భయంతోనే సాయిని ఆమెకు అండగా ఉంచామని ఆమె వివరించారు. చివరికి ఈ కేసు ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి.