ద్వీపదేశం శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. మరో వైపు రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో కొలంబోకు తరలివచ్చిన ఆందోళనకారులు ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికార నివాసాన్ని ముట్టడించారు. నిరసన కారులు శ్రీలంక జండాలు చేబూని హెల్మెట్ లు పెట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు. అనేక మంది శ్రీలంక సైనిక సిబ్బంది కూడా అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసనకారులతో చేరారు. నిరసన కారులను కట్టడి చేసేందుకు పోలీసులు గాలులోకి కాల్పులు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో నిరసన కారుల నుండి తప్పించుకునేందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన నివాసం నుండి పరారయినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూ విధించగా హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్షాల డిమాండ్ మేరకు కర్ఫూ ఎత్తివేసింది. దీంతో శనివారం పెద్ద సంఖ్యలో నిరసన కారులు కొలంబోలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అయితే ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారంతో శుక్రవారం రాత్రే అధ్యక్షుడు రాజపక్సను సురక్షితంగా ఆర్మీ కేంద్ర కార్యాలయానికి తరలించినట్లు వ్రభుత్వ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. శనివారం జరిగిన ఆందోళనలో దాదాపు 30 మంది గాయపడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. వీరిలో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. నిరసన కారులు పూర్తిగా అధికార నివాసంలోకి ప్రవేశించారు. అధ్యక్షుడు రాజపక్స నివాసంలోని వంట గదిలోకి నిరసనకారులు వెళ్లి ఆహారాన్ని వండుకోవడం, అంతకు ముందు నివాస ప్రాంగణంలోని కొలనులో ఈత కొడుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.
మరో పక్క ఎల్ఎల్ పీపీ కి చెందిన 16 పార్లమెంట్ సభ్యులు దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సను రాజీనామా చేయాలని అభ్యర్ధించారు. కాగా దేశంలో ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష జరిపేందుకు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే అత్యవసర కేబినెట్ భేటీకి నిర్ణయించారు.
ట్విట్టర్ డీల్ నుండి తప్పుకున్న ఎలాన్ మస్క్ .. చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్న ట్విట్టర్