Srilanka Cricket Team: ఒక ఆరేళ్ళ ముందు శ్రీలంక క్రికెట్ జట్టు ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా ఉండేది. గత దశాబ్ద కాలంలో వరుసగా ఐసిసి టోర్నమెంట్లో ఫైనల్స్ చేరి మధ్యలో 2014 టి20 ప్రపంచ కప్ గెలిచిన శ్రీలంక జట్టు ఈ సంవత్సరం జరగబోయే టి20 ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు అసోసియేట్ జట్లతో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రపంచ కప్ కు వారు అర్హత సాధించే విషయం కూడా అనుమానంగా మారింది. ఇక ప్రస్తుతం విషయానికి వస్తే ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ తర్వాత శ్రీలంక తర్వాత భారత జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కారణంగా భారత్ శ్రీలంక టూర్ కు తన బీ-గ్రేడ్ జట్టుని పంపిస్తుంది. అయినప్పటికీ భారత ఆటగాళ్ల తో పోలిస్తే శ్రీలంక జట్టు బలహీనంగానే ఉంది.
వారి పర్ఫార్మెన్స్ రోజు రోజుకి దిగజారిపోతోంది. ఇలాంటి సమయంలో శ్రీలంక జట్టులో ముగ్గురు ప్రధాన ఆటగాళ్లు అయిన కుశాల్ మెండిస్, ధనుష్ గుణతిలక, నిరోషాన్ డిక్వెల్లా పైన శ్రీలంక క్రికెట్ బోర్డు సస్పెన్షన్ విధించింది. ఇంగ్లాండ్తో జరిగిన చివరి టీ20 లో దారుణ పరాజయం చెందిన తరువాత వీరు ముగ్గురూ బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించి నగర వీధుల్లో సంచరించడం జరిగింది.
దీనితో శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వెంటనే వీరు ముగ్గురు పై నిషేధం విధించింది. శ్రీలంక ప్రస్తుతం ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ఆడవలసి ఉంది. ఈ సిరీస్ తో పాటు భారత్ తో జరగబోయే సిరీస్ కు కూడా వీరు దూరం కానున్నారు. శ్రీలంక కు ఇక భారత్ చేతితో కూడా వైట్ వాష్ తప్పదని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.