రెండు రోజుల క్రితం శ్రీశైలం ఏడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది అధికారులు, సిబ్బంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ జల విద్యుత్ కేంద్రంలో ప్రమాద ఘటనకు సంబంధించి షాకింగ్ నిజాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
పవర్ హౌస్ లో టర్బైన్ల నుండి వచ్చే నీటి తుంపర్లు వల్ల కేబుల్స్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని స్థానిక ఏఇలు రెండు రోజుల క్రితమే గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారట. నిపుణులను పంపి ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేసిన ఉన్నతాధికారులు దాని గురించి పట్టించుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రమాదానికి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కూడా ఒక కారణమని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉన్నతాధికారులు తీసుకెని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని భావిస్తున్నారు. ప్రతి షిఫ్టు ప్రారంభానికి ముందు విధిగా జరగాల్సిన తనిఖీలు జరపడం లేదనీ, సీజన్ ప్రారంభంలో ఉన్నతాధికారుల సమక్షంలో నిర్వహించాల్సిన తనిఖీలు నామమాత్రంగా జరుగుతున్నాయన్న మాట వినిపిస్తోంది.
పవర్ హౌస్ లో ఏదైనా ప్రమాదం జరిగితే సిబ్బందిని రక్షించేందుకు ఏడు ఎమర్జన్సీ వాహనాలు అందుబాటులో ఉండాలి. కానీ ప్రమాదం జరిగిన సమయంలో ఒకే వాహనం అందుబాటులో ఉందట. ప్రమాదం సమయంలో మంటలను ఆర్పేందుకు ప్రతి యూనిట్ లో ఆక్సిజన్ సిలెండర్ లు ఉండాలి. సిలెండర్ లు అయితే ఉన్నాయి కానీ అవి సిినిమా హాళ్లలో మాదిరిగా చిన్నవిగా ఉన్నాయట.
ప్రమాదం జరిగిన సమయంలో పొగ ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేందుకు ఎర్పాటు చేసిన ఎగ్జాస్ట్ ఫ్యాన్ లు పని చేయడం లేదట. ఎన్ డి ఆర్ ఎప్ సిబ్బంది వచ్చి సరి చేసిన తరువాత ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పని చేశాయంటున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు సిబ్బంది బయటకు వెెళ్లేందుకు యమర్జన్సీ ఎగ్జిట్ అందుబాటులో ఉన్నా అది అందరికీ తెలియదట, పాత సిబ్బందికి మాత్రమే తెలుసు ఉంటున్నారు. ఎమర్జన్సీ ఎగ్జిట్ తెలియని వారే పొగలో ఊపిరి ఆడక మృతి చెందారు అంటున్నారు.
మరో విషయం ఏమిటంటే పవర్ హౌస్ లో ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని ప్రాధమిక విచారణలో వెల్లడయ్యిందట. మంటలు అంటుకున్న ప్యానల్ బోర్డుకు రెండు వేర్వేరు మార్గాల్లో బ్యాటరీల నుండి డైరెక్ట్ కరెంటు అందుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు స్విచ్ లూ పని చేయలేదని తెలిసింది. ఒక వేళ ఆ స్విచ్ లు పని చేసి ఉంటే అగ్ని ప్రమాదం అయిదు నిమిషాల్లోనే అదుపులోకి వచ్చేదని నిపుణులు అంటున్నారు.
ప్రమాదం గురించి ఇలాంటి వార్తలు వస్తుండగా జెన్ కో వర్గాలు మాత్రం వాటిని కొట్టి పారేస్తున్నారు. నిర్వహణలో లోపాలు అంటూ వస్తున్న వార్తలను వారు ఖండిస్తున్నారు. పవర్ హౌస్ లో ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించాయనీ దీంతో అక్కడ అక్సిజన్ లెవల్స్ పడిపోయి పొగ కమ్మేయడంతో అక్కడ ఉన్న వారు బయటకు రాలేని పరిస్థితిలో ఊపిరి ఆడక మృతి చెందారు అని చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి నిర్లక్ష్యం అనేది ఉంటే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉంది.