వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తరువాత రెండవ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురవడంతో పాటు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుకొంటోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి లక్షకు పైగా క్యూసెక్కుల వరద నీరు చేరుకొంటున్నది. ఎగువ నుండి వస్తున్న కృష్ణా నది ప్రవాహానికి హంద్రీ వరద తోడవ్వడంతో మంగళవారం సాయంత్రానికి 1,03,150 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుండగా, శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్న జలాల్లో 38,140 క్యూసెక్కులు నాగార్జున సాగర్లోకి చేరుతున్నాయి. దీంతో సాగర్లో నీటి నిల్వ 173.66 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 845.70 అడుగుల్లో 71.44 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. అదే విధంగా గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 87,938 క్యూసెక్కులు చేరుతుండగా దిగువకు 75,621 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
మరో పక్క రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద ప్రవాహం చేరుతున్నది. హంద్రీ నది పరవళ్లు తొక్కుతుండడంతో గాజులదిన్నె ప్రాజెక్టులో నీటి నిల్వ 4.30 టీఎంసీలకు చేరుకున్నది. తుంగభద్ర నదికి ప్రవాహం పెరగడంతో సుంకేశుల, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. అనంతపురం జిల్లాలో కురిసిన వర్షాలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీటి నిల్వ 4.50 టీఎంసీలకు చేరింది. విశాఖపట్నం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల శారద నది నుంచి రైవాడ రిజర్వాయర్లోకి భారీగా వరద చేరుతోంది. ఇక తాండవ ప్రాజెక్టు 80 శాతం నిండింది. ఉభయ గోదావరి, జిల్లాల్లోని ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు భూపతిపాళెం, ముసురుమిల్లి, జుర్రేరు వంటి చిన్న తరహా ప్రాజెక్టులూ నిండాయి.
2014 నుండి 2019 వరకు చంద్రబాబు హయాంలో కరువు విలయతాండవం చేసింది. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. కృషా నదికి భారీగా వరద చేరలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రెండవ ఏడూ కూడా వర్షాలు బాగానే కురుస్తున్నాయి. ప్రాజెక్టులకు సంవృద్ధిగా వరద నీరు చేరు తుండటంతో జలాశయాలు నిండుతున్నాయి.ప్రాజెక్టులకు జల కళ సంతరించుకోవంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.