Srirama Navami: భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతీరాముల కళ్యాణం జరిగింది. మిథులా స్టేడియం లోని మండలంలో సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీసీతారాముల విగ్రహాలను కళ్యాణ మండపానికి ఊరేగింపుగా అర్చకులు తీసుకువచ్చారు. ఉదయం 10.30 గంటలకు కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాగా అభిజిత్ లగ్నంలో సీతారాములకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మంగళ్యధారణ చేశారు. తర్వాత తలంబ్రాల కార్యక్రమం జరిగింది.
ఈ వేడుకల సందర్భంగా సీతారాములకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీతారాముల కళ్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో చేశారు. ప్రతి ఏడాది కంటే ఈ సారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. మిథులా స్టేడియానికి సువర్ణ ద్వాదశ వాహనాలపై స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా వచ్చారు. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రామనామస్మరణతో మిథులా స్టేడియం మారుమోగింది. వివిధ టీవీ ఛానళ్లు సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా, తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు ఇళ్లల్లో నుండే వీక్షించి తరించారు. త్రిదండి చిన జీయర్ స్వామి వ్యాఖ్యాతగా స్వామి వారి కళ్యాణ ఘట్టాలను వివరించారు.