స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ ఎస్ సీ) పరీక్షలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసిఆర్ రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆంగ్లం, హిందీతో పాటు రాజ్యాంగంలోని 8వ షెడ్యుల్ లో పొందుపర్చిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు అందినట్లుగా తెలంగాణ సీఎంఓ వెల్లడించింది.
రైల్వేలు, రక్షణ, బాంకులు తదితర కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా చేపట్టే ఉద్యోగ నియామక పోటీ పరీక్షలను హిందీ, ఆంగ్ల భాషల్లో నిర్వహించడం వల్ల ఇతర భాషా పరిజ్ఞానం గల విద్యార్ధులు నష్టపోతున్నారని తెలంగాణ సీఎం కేసిఆర్ 2020 నవంబర్ నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి లేఖ రాశారు. అన్ని భాషల్లో పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. అన్ని భాషల్లో పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించిందని సీఎం ఓ తెలిపింది. కేసిఆర్ చొరవ కారణంగా కోట్ల మంది విద్యార్ధులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది.