అమరావతి, డిసెంబర్ 24: రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్న అత్యంత కీలకమైన డీఎస్సీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. మొత్తం 125 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 7,902 టీచర్ పోస్టుల కోసం 6,08,159 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఆన్లైన్ విధానంలో రెండు దశల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి ఈ నెల 30 వరకు తొలి దశ, జనవరి 18 నుంచి 31 వరకు రెండవ దశ పరీక్షలు జరుగనున్నాయి. తొలి దశలో 2,43,175 మంది హజరు అవుతున్నారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీలో 113 కేంద్రాలు, తెలంగాణలో 4, ఒడిసాలో 3, బెంగళూరులో 2, చెన్నైలో 3 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయ నియామక పరీక్షలకు 536 మంది దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోగా వీరిలో కొందరికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.