Funerals: అంత్యక్రియలు Funerals.. దేశంలో కరోనా విజృంభణ కలకలం రేపుతోంది. రోజువారీ కేసుల్లో అమెరికాను భారత్ దాటేసింది. ఏకం 3,14,835 పాజిటివ్ కేసులతో భారత్ లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మరణాల సంఖ్య కూడా గతేడాదిలో లేనంతగా పెరిగిపోతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 2వేలు దాటేసింది. కరోనా మృతుల అంత్యక్రియలకు స్థలాలు దొరకటం లేదు.. దొరికినా క్యూలతో ఆ ప్రాంతాలు నిండిపోతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా బెంగళూరులో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
బెంగళూరు నగర పరిధిలో కరోనా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో నగరంలోని స్మశానాల్లో స్థలం చాలట్లేదు. మృతదేహాలతో ఆంబెలెన్సుల క్యూలు పెరిగిపోతున్నాయి. దీంతో ఆంబులెన్సుల కొరతా ఏర్పడుతోంది. దీంతో నివారణ చర్యలకు ఉపక్రమించింది కర్ణాటక ప్రభుత్వం. నగరంలో కట్టెలు, కరెంట్ తో అంత్యక్రియలు జరిపే స్మశానాలు 14 వరకూ ఉన్నాయి. వీటికి అదనంగా నగర ఔటర్ పరిధిలో కరోనా మృతుల అంత్యక్రియల కోసమే ఆఘమేఘాల మీద ప్రత్యేకంగా 200 ఎకరాలు సిద్ధం చేసింది. కురబరహళ్లి గోమాళ ప్రాంతంలో ఈ స్థలం కేటాయించింది. అయితే.. ఇందుకు ఆ ప్రాంతవాసులు అంగీకరించలేదు. కరోనా మృతుల అంత్యక్రియలు జరిపితే వైరస్ తమ ఊళ్లలోకి వస్తుందని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
దీంతో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. ఊరి పెద్దలతో చర్చలు జరిపారు. కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. గ్రామస్థులతో చర్చలు జరిపారు. మృతదేహాల ఖననం.. లేదా పూడ్చిపెట్టడం వల్ల కరోనా సోకదని చెప్పారు. పైగా.. కేవలం రెండు నెలలు మాత్రమే ఇక్కడ అంత్యక్రియలు జరుపుతామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు ఒప్పుకోవడంతో కురుబరహళ్లి గోమాళ ప్రాంతంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు ప్రారంభించారు. మరో రెండు రోజుల్లో అక్కడ మృతులకు అంత్యక్రియలు జరుగనున్నాయి. దేశంలో కరోనా కరాళ నృత్యం ఏస్థాయిలో ఉందో తెలిపేందుకు ఈ ఉదంతం నిదర్శనంగా నిలుస్తోందని చెప్పాలి.