ఉన్న చట్టాలను ఎంత పటిష్ట పరిచినా… మరియు మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలను తీసుకొని వస్తున్నా ఆడవారిపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. అయితే ఈ విషయంలో అండగా నిలవాల్సిన పోలీసులే సదరు బాలికపై దారుణానికి ఒడిగట్టిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 13 ఏళ్ల బాలికపై ఓ పోలీస్ అధికారి తోపాటు ఆమె సవతి తండ్రి, అతని స్నేహితుడు అత్యాచారానికి ఒడిగట్టిన దుర్ఘటన ఒడిస్సా లో చోటు చేసుకుంది.
సుందర్ గడ్ జిల్లా బీరమిత్రపూర్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి జిల్లా శిశు సంక్షేమ కమిటీ అధికారి శ్రీకాంత్ జేనా అందించిన వివరాల ప్రకారం…. ఈ నెల 14న బీరమిత్రపూర్ పట్టణం బస్టాండ్లో అనారోగ్యంగా అచేతనంగా పడి ఉన్న 13 ఏళ్ల బాలిక శిశు సంక్షేమ కమిటీ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించగా ఆమెను పరీక్షించిన వైద్యులు తనకు అబార్షన్ జరిగినట్లు తెలిపారు.
కొద్ది రోజులకి స్పృహలోకి వచ్చిన ఆ బాలిక ను విచారించగా బీరమిత్రపూర్ ఠాణా అధికారి, మరొక పోలీసు, ఆమె సవతి తండ్రి మరియు అతని స్నేహితుడు కలిసి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. నాలుగు నెలలుగా శారీరిక హింసిస్తున్నారని… ఆ తర్వాత గర్భం దాల్చిన తనకు బలవంతంగా అబార్షన్ చేయించి బస్టాండ్ లో పడేసి వెళ్లారని తెలిసింది.
తక్షణమే స్పందించిన ఎస్పి, మహిళా డిఎస్పీ తో కలిగిన అధికారుల బృందం ఈ కేసును దర్యాప్తు చేసి పోలీస్ ఠాణా అధికారి ఆనంద్ చంద్రమాఝీ ఠాణా భవనం పై ఉన్న గదిలో ఈ అమానవీయ ఘటన జరిగినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ అమానుష ఘటన డీజీపీని సైతం కదిలించింది. దీంతో ఆయన ఠాణా అధికారి, మరో పోలీసును సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న సవతి తండ్రి, ఆయన స్నేహితుని కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ సౌమ్యమిశ్ర తెలిపారు.