ఆంధ్రప్రదేశ్ లో చాలా వేగంగా రాజకీయాలు మారిపోతున్నాయి. రాయలసీమలోని కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే… అక్కడ దశాబ్దాలుగా ఫ్యాక్షన్, ఆధిపత్య పోరుతోనే పాలిటిక్స్ నడుస్తుండటం అనేది జగమెరిగిన సత్యం! అసలు 1983లో టీడీపీ పుట్టినప్పటి నుంచీ ఆ తర్వాత 2004 వరకూ జమ్మలమడుగులో అంటే టీడీపీనే రాజ్యమేలింది! మరో పార్టీ అక్కడికి రావాలంటేనే భయపడేది! అయితే అదే సమయంలో “జమ్మలమడుగు టీడీపీకి కంచుకోట” అని టాక్ నడిచింది అనడంకంటే.. అలా మార్చారు మాజీ మంత్రి పొన్నపురెడ్డి శివారెడ్డి అనడమే మంచిది.
అలా రాజకీయాలు నడుస్తోన్న కాలంలో… ఫ్యాక్షన్ పోరులో శివారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత ఆయన అన్న కుమారుడు రామసుబ్బారెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. రామ సుబ్బారెడ్డి ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే.. 2004లో టీడీపీ ఓడిపోవడంతో ఉమ్మడి ఏపీలో అధికారం కోల్పోయింది. దీంతో ఒకే పార్టీలో రెండు వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు, చీలికలు జరిగాయి. ఆ దెబ్బతో టీడీపీ వరుసగా మూడుసార్లు ఓడిపోవడంతొ కోటకు బీటలు వారాయి.. ఫలితంగా నియోజకవర్గంపై పట్టు కోల్పోవాల్సి వచ్చింది. ఇక 2014లో విభజిత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. రామసుబ్బారెడ్డి ఓటిమి పాలయ్యారు.
అదే సందర్భాన్ని తాత్కాలిక లబ్ధికోసం సమయాన్ని క్యాష్ చేసుకున్న ఆదినారాయణ రెడ్డి.. వైసీపీ నుంచి టీడీపీలోకి మారి మంత్రిపదవి దక్కించుకున్నారు. అదే అదునుగా జమ్మలమడుగులో టీడీపీ బలోపేతంపై దృష్టి సారించింది టీడీపీ. ఇది మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గానికి ఏమాత్రం రుచించలేదు. అయినా రెండు ఫ్యాక్షన్ వర్గాలను కలిసి పనిచేయాలని చూసించారు చంద్రబాబు. అయితే ఆ వ్యూహం బెడిసి కొట్టింది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేక పోయాయి. ఫలితంగా ఈ వ్యవహారం… ఆదినారాయణరెడ్డి – రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరును మరింత బలపరిచింది.
2019 ఎన్నికల్లో రాజీ సూత్రంతో చెరిసగం అన్నట్లు టీడీపీ అధినేత రాజీకుదిర్చారు. అయితే జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డిని బరిలో దింపిన టీడీపీ.. ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీగా పోటీ చేయించింది. కానీ.. వైసీపీ ప్రభంజనం ముందు సైకిల్ అ్రడస్ లేకుండా పోయింది! మొత్తం రాయలసీమ అన్నింటిలో నాలుగు జిల్లాలు కలిపి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్! మొత్తానికి ఈ ఓటమితో జమ్మలమడగు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఆ తర్వతా జరిగిన పరిణామాలతో ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోయారు. రామసుబ్బారెడ్డి.. వైసీపీ కండువా కప్పేసుకున్నారు.
కాగా ఇలాంటి జమ్మలమడుగులో ఇప్పుడు టీడీపీకి నాయకుడు అనేవాడే కరువయ్యాడు. ఫలితంగా.. టీడీపీ జెండా ఎగరలేని.. కార్యకర్త కనబడని.. నాయకుడు లేని పరిస్థితికి వచ్చింది. అసలు అక్కడ టీడీపీ జెండా పట్టుకుని ధైర్యంగా ముందుకు నడిచేవాడు లేడంటే అతిశయోక్తి కాదేమో! మరి ఇలాంటి సమయంలో చంద్రబాబు.. “పార్టీనుంచి ఒక్కరు పోతే వెయ్యి మంది పుట్టుకొస్తారు” అని చెప్తుంటారు కదా..! మరి వారిలో ఒకరికైనా ధైర్యం చెప్పి పార్టీ బాధ్యతలు అప్పజెప్తారా? లేదా? అనేది ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అయిన జమ్మలమడుగులో మళ్లీ అధికారం దక్కాలంటే.. పసుపు జెండా రెపరెపలాడాలంటే… చంద్రబాబు సుపత్రుడు లోకేశ్ బాబును అక్కడ నుంచి ఈసారి పోటీ చేయించాలని ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది! ఆంధ్రా ప్రాంతంలో చినబాబు బలం చూసేసిన బాబు.. మళ్లీ ఆ తొమ్మిది జిల్లాలో పోటీ చేయించే సాహసం చేసే ఆలోచన చేయకుండా… ఈసారి సీమకు పంపాలని చూస్తున్నారంట! అందులో భాగంగానే చినబాబును జమ్మలమడుగు రాజకీయాల్లోకి దింపనున్నారని తెలుస్తోంది! ఈ సందర్భంగా… బాబు సాహసోపేత నిర్ణయం ఎంత వరకూ వర్కవుట్ అవుతుందనేది చూడాలి మరి అని సీమ తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు !!