పార్క్ హయత్ హోటల్ లో రహస్య భేటీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన క్షణం నుండి ఆన్ లైన్ లోనూ, మీడియాలోనూ రచ్చ రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసలు అంత పెద్ద హోటల్, నిత్యం వీఐపీలతో రద్దీగా ఉండే హోటల్ నుంచి ఆ ఫుటేజ్ ఎలా బయటకు వచ్చిందబ్బా అనేది ఒక చర్చ అయితే… అసలు ఈ భేటీ ఎందుకు జరిగింది, ఈ భేటీ వెనక ఉన్న ఇంకా బలమైన రాజకీయ శక్తులు ఏమిటి, ఈ ఫుటేజ్ వెలుగులోకి రావడం వెనక పనిచేసిన శక్తులేమిటి అనేవి చాలా పెద్ద పెద్ద ప్రశ్నలే!
ఈ భేటీ వెనక ఉన్నది చంద్రబాబే అని వైకాపా నేతలు విమర్శలు చేస్తుండగా.. ఈ భేటీలో కనిపిస్తున్నది ముగ్గురే అయినా కనిపించని నాలుగో బిగ్ బాస్ ఆన్ లైన్ ద్వారా ఈ మీటింగ్ లో పాల్గొన్నారని విజయసాయి ట్విట్టర్ లో పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలు, అసలు ఈ భేటీ పెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయంటేనే… అందులో కచ్చితంగా బాబు పాత్ర లేకుండా ఉండదనేది బలంగా వినిపిస్తోన్న కామెంట్లు! ఇందులో నిజంగా బాబు పాత్ర ఉంటే మాత్రం… వైకాపాకు అంతకుమించిన అదృష్టం, బాబుకు అంతకు మించిన దురదృష్టం మరికటి ఉండదు!!
ఆ సంగతులు అలా ఉంటే.. అసలు ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఫుటేజ్ బయటకు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ ఫుటేజ్ లీకేజి అనేది విజయసాయి రెడ్డి పనే అని కామెంట్ పడుతున్నాయి! ఇలాంటి విషయాలతో చంద్రబాబుని ఇరుకున పెట్టడంలో విజయసాయిరెడ్డి పాత్ర కచ్చితంగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో.. హోటల్ సిబ్బంది పాత్ర సంగతి కాసేపు పక్కనపెడితే… ఏపీ ఇంటిలిజెన్స్ పాత్ర, సాయిరెడ్డి ఆలోచనా కీలకంగా పనిచేశాయని అంటున్నారు. ఆ హోటల్ లో ఆ సమయానికి ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా… విషయం గ్రహించి, వైకాపా నేతలకు ఉప్పందించి, తద్వారా ఫుటేజ్ ను తెప్పించుకుని ఉంటారని.. ఈ కార్యక్రమానికి 10రోజులు పట్టి ఉంటుందని మరో వాదన!
ఏది ఏమైనా… మీటింగ్ వెనుక బాబు ఉన్నాడా లేదా, ఫుటేజ్ లీకేజ్ వెనక విజయసాయి రెడ్డి ఉన్నాడా లేడా అనే విషయాలు పక్కనపెడితే… “వాళ్లు ముగ్గురూ కలిశారన్నది నిజం – ఇది వైకాపాకు చాలా ప్లస్ అన్నది వాస్తవం – నిమ్మగడ్డ ప్రతిష్టకు మాయని మచ్చ అనేది సత్యం” అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!!