ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు పర్వదినంగా భావించేది క్రిస్మస్. క్రిస్మస్ అనగానే మనకు ముందుగా గుర్తువచ్చేది క్రిస్మస్ ట్రీ. ఈ పర్వదినాన అందరి ఇళ్లల్లో మనకు ఈ క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది. చర్చి లలో కూడా మనకి ఈ ట్రీ తారసపడుతుంటుంది. ఈ చెట్టును విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. అయితే, ఈ చెట్టును ఎందుకు పూజిస్తారు, ఎందుకు అలంకరిస్తారు, అసలు దాని వెనక ఉన్న చరిత్ర ఏమిటో తెలుసా?
మనం క్రిస్మస్ చెట్టు గురించి ఎన్నో కథలు వింటూ ఉంటాం. అయితే వాటిలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన కథ ఏమిటంటే..
ఈ కథ మొత్తం క్రీస్తుశకం ఎనిమిదో శతకం నాటిది. సెయింట్ బోనీఫస్ అనే వ్యక్తి ఓ సారి జర్మనీకి వెళ్లగా అక్కడి ఆదివాసులు ‘ఓక్’ చెట్టు ను పూజించడం ఆయన చూసారు. ఆ చెట్టు చాలా పవిత్రమైనదని దైవంగా భావించి దానికి అప్పటిలో నరబలులు కూడా ఇచ్చేవారట. అయితే ఇది చుసిన బోనిఫస్ ఎలాగయినా ఈ దురాచారాన్ని రూపుమాపాలని భావించి ఆ చెట్టు వద్ద నరబలులు చేయొద్దని వాళ్లకు చెప్పారట. పాప గ్రస్తులయిన మనుషులను విముక్తులు చేయడానికి ఏసు జన్మించారని ఇకనుంచి ఓక్ వృక్షానికి నరబలులు ఇవ్వడం మానివేసి ఏసుకు ఎంతో ప్రియమయిన ‘ఫర్’ చెట్టును పూజించాలని ఆదివాసులకు చెప్పాడట.
అయితే ఈ చెట్టును పూజించుటకు ఆ చెటు కొమ్మలను అలంకరించాలని చెప్పాడట. కాబట్టి అప్పటి నుంచే క్రైస్తవులు ఫర్ చెట్టును పూజించడం ప్రారంభించారట. క్రిస్మస్ ట్రీ మీద ఉన్న కథలు అన్నిటిలోను ఈ కథ బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పటికి ఈ కథనే మనం ఎక్కువగా వింటూ ఉంటాం.