దొంగతనం చేయడం ఎంత పెద్ద నేరమో తెలుసు కదా. అయినా కూడా కొందరు పని చేయ చేతగాక.. డబ్బులు సంపాదించే మార్గాలు తెలియక.. సోమరిపోతులు.. దొంగతనాలు చేసి బతుకుతుంటారు. దొంగలు కూడా ఇప్పుడు బాగా అప్ డేట్ అయ్యారు. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా దొంగతనం చేయాలో వాళ్లకు బాగా తెలుసు.
తాజాగా జరిగిన ఓ దొంగతనం గురించి తెలిస్తే మాత్రం మీరు నవ్వలేక చస్తారు. తమిళనాడులో ఓ గుడిలో దొంగతనం చేయడానికి వెళ్లాడు ఓ ప్రబుద్ధుడు.
తిరువనమియార్ అనే ఊళ్లో ఉన్న మరుండేశ్వర్ ఆలయానికి ఓ దొంగ అర్ధరాత్రి వెళ్లాడు. ముందు గర్బ గుడి ముందు నిల్చొని భక్తితో చాలాసేపు ప్రార్థనలు చేశాడు. ఆ తర్వా హుండీలో డబ్బులు కూడా వేశాడు. ఆ తర్వాత వెంటనే ఓ రాడ్ తీసుకొని రాడ్ తో హుండీని పగులగొట్టి.. హుండీలోని డబ్బునంతా దోచుకెళ్లాడు.
మాస్కు ధరించి ఉన్న ఆ దొంగ ఎవరో సరిగ్గా గుర్తుపట్టలేకపోయినప్పటికీ.. ఆ విచిత్ర దొంగ గురించి తెలుసుకున్న స్థానికులు నవ్వాపుకోలేకపోతున్నారు. ఈ ఘటన మొత్తం.. ఆలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ వెరైటీ దొంగ కోసం గాలిస్తున్నారు.