హైదరాబాదు: వీధి కుక్కలను హతమార్చినందుకు మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై కేసులు నమోదు అయ్యాయి. నిబంధనల ప్రకారం వీధి కుక్కల బెడద నివారణకు వాటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి ప్రత్యేక వాహనాల్లో దూర ప్రాంతాల్లో వదిలివేయాల్సి ఉంటుంది. వాటిని హతమార్చడం నేరంగానే పరిగణిస్తారు. అయితే వికారబాద్ పురపాలక సంఘ అధికారులు ఇటీవల సుమారు 50కిపైగా కుక్కలకు విషాహారం పెట్టి చంపారు. తరువాత వాటిని మూకుమ్మడిగా భూమిలో పాతిపెట్టారు. దీనిపై జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఐపిసి 11,429 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మున్సిపల్ కమిషనర్తో పాటు ఇతర అధికారులను ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేర్కొన్నారు. భూమిలో పాతిపెట్టిన కుక్కల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. వాటి నమూనాలను ల్యాబ్కు పంపినట్లు వికారాబాద్ ఎస్పి తెలిపారు.
దీనిపై జంతు ప్రేమికుడు కృష్ణమూర్తి ట్విట్టర్ వేదికగా స్పందించారు. సంహరించిన కుక్కలను సామూహికంగా ఖననం చేస్తున్న చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ‘ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు బాధగా ఉంది. జూన్ 19న వికారాబాద్ మున్సిపాలిటీ సిబ్బంది పాతిపెట్టిన 30కుక్కలను వెలికితీశారు. జూన్ 22న సిద్దిపేటలో 40 కుక్కలకు విషమిచ్చి చంపారు. మూగ జీవాలను హతమార్చడం వాటి నిరోధానికి పరిష్కారంకాదు. ఇది చట్ట విరుద్దం. ఈ రెండు ఘటనలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని ఆయన మండిపడ్డారు.