ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్ దేశంలోని పాన్ కార్డుదారులు తమ కార్డులను ఆధార్కు లింక్ చేయాలని గతంలోనే పలు మార్లు డెడ్లైన్లను పొడిగించిన విషయం విదితమే. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు అందుకు గడువుంది. అయినప్పటికీ దేశంలోని కోట్ల మంది పాన్ కార్డు హోల్డర్లు ఇప్పటికీ ఆ కార్డులను ఆధార్కు ఇంకా లింక్ చేయలేదు. దీంతో ఐటీ విభాగం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
నిర్ణీత గడువులోగా పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే పాన్ కార్డులు పనిచేయకుండా పోతాయని, తరువాత వాటితో ఏవైనా లావాదేవీలు జరిపితే పెద్ద ఎత్తున జరిమానా కట్టాల్సి వస్తుందని గతంలోనే పలుమార్లు ఆదాయపు పన్ను విభాగం హెచ్చరించింది. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే అలాంటి వ్యక్తులకు చెందిన పాన్ కార్డులు పనికిరాకుండా పోతాయని ఐటీ విభాగం హెచ్చరిస్తోంది. దాదాపుగా 18 కోట్ల వరకు పాన్ కార్డులను ఇంకా ఆధార్కు లింక్ చేయలేదని, అందువల్ల అవి మార్చి 31వ తేదీ తరువాత పనిచేయవని తెలిపింది.
దేశంలో ఆదాయపు పన్ను ఎగ్గొట్టేందుకు చాలా మంది ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అలాంటి వారి ఆట కట్టించడం కోసమే పాన్ను కచ్చితంగా ఆధార్కు లింక్ చేయాలని ఎప్పటి నుంచో ఐటీ శాఖ యత్నిస్తోంది. అయితే ఇకపై ఇలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించకూడదని భావిస్తోంది. దేశంలో 50.95 కోట్ల పాన్ కార్డు దారులు ఉండగా, వారిలో కేవలం 6.48 కోట్ల మంది మాత్రమే తమ ఐటీ రిటర్న్స్ను దాఖలు చేశారు. మిగిలిన వారు పన్ను ఎగ్గొడుతున్నారు లేదా.. జీరో ట్యాక్స్ లయబిలిటీ చూపిస్తున్నారు. అయితే వీరిలో కొందరు ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులను వాడుతుండవచ్చని, అందుకనే అలా జీరో ట్యాక్స్ లయబిలిటీ చూపిస్తున్నారని ఐటీ విభాగం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇలాంటి వారిపై కఠిన చర్యలు చేపడుతామని ఆ శాఖ చెబుతోంది.