రాష్ట్ర రవాణా మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పై జరిగిన హత్యయత్నం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితుడు నాగేశ్వరరావుపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణకు గానూ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు తెలిపారు.
మంత్రి నాని పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. మంత్రి నానిపై పదునైన తాపీతో దాడికి పాల్పడిన నాగేశ్వరరావు టీడీపీకి చెందిన కార్యకర్త అని ప్రచారం జరుగుతోంది. అయిదు నెలల క్రితం పట్టపగలే మంత్రి నాని ప్రధాన అనుచరుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మేకా భాస్కరరావు హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో కుట్రదారుడిగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేయగా కొద్ది రోజులు రిమాండ్లో ఉన్న అనంతరం ఆయన బెయిల్పై వచ్చారు.
అయితే మంత్రి నానిపై జరిగిన హత్యాయత్నాన్ని పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ తో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నిన్న మంత్రి నాని ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. భవన నిర్మాణ కార్మికుడైన నాగేశ్వరరావు నిన్న తాపీతో మంత్రి నానిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది.